
– నేడు సుందరాంగుల హెరిటేజ్ వాక్
– చారిత్రక చార్మినార్ సందర్శన
– లాడ్బజార్ గాజుల వీక్షణ
– చౌమహల్లాప్యాలెస్లో డిన్నర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
హైదరాబాద్ మహానగరం ప్రపంచ సుందరీమణులతో సందడిగా మారిపోయింది. పది, ఇరవై కాదు.. ఏకంగా 110 దేశాలకు చెందిన అందగత్తెలు నగరంలో బస చేశారు. మిస్ వరల్డ్ 2025 పోటీల నేపథ్యంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గచ్చిబౌలి వేదికగా శనివారం అట్టహాసంగా జరిగిన అందాల పోటీల అరంభంలో విభిన్న రీతుల్లో ఆకట్టుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిపించారు. ఆదివారం హైటెక్స్లో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో అలరించారు. ఫొటోలకు పోజులిస్తూ ధగధగలాడారు.
నేడు పాతబస్తీలో అందాల విందు
భాగ్యనగరంలో అందాల భామల పర్యటనలు ఆసక్తిగా మారాయి. వారు సందర్శిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణ నెలకొంది. ముత్యాల నగరిగా పేరొందిన హైదరాబాద్లో అందాల భామలు పర్యటిస్తుండడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. పోటీల్లో భాగంగా మంగళవారం పాతబస్తీలో ప్రఖ్యాతిగాంచిన చార్మినార్, లాడ్బజార్లో హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ఈ సందర్భంగా వారు అక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోనున్నారు. లాడ్బజార్లోని గాజుల తయారీ కళాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడనున్నారు. సాయంత్రం 6 గంటలకు చౌమహాల్లా ప్యాలెస్ను సందర్శించనున్నారు. అక్కడ తెలంగాణ పర్యాటక శాఖ మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేసింది. భామలందరూ అక్కడే డిన్నర్ చేయనున్నారు.
ప్రత్యేక చర్యలు
అందాల భామల పర్యటన నేపథ్యంలో చార్మినార్ కట్టడాన్ని ఇప్పటికే మువ్వన్నెల జెండా రంగుల్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు, డివైడర్లకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. లాడ్బజార్, మోతీగల్లి, చౌమహల్లా ప్యాలెస్ వరకు రోడ్డుకు ఇరువైపులా సాయుధ బలగాలు, పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెరిటేజ్ వాక్ సమయంలో ఎంపిక చేసిన గాజులు, ముత్యాలు, నగల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు దుకాణ యజమాను లు, వాటిల్లో పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు తెలిసింది.
ఈ ప్రాంతాలే ఎందుకంటే..
ఈరోజు అందాల భామలు సందర్శించే ప్రాంతాలు ఇప్పటికే పర్యాటకంగా ఎంతో ప్రాచుర్యం పొందినవే. చార్మినార్, లాడ్బజార్, చౌమహల్లా ప్యాలెస్ లను వారు సందర్శించనున్నారు. గ్లోబల్ ఐకాన్గా చార్మినార్ ఇప్పటికే అవతరించింది. కుతుబ్షాహీ వంశానికి చెందిన 5వ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్షా తన రాజధానిని గోలకొండ నుంచి హైదరాబాద్కు కొత్తగా ఏర్పడిన పట్టణానికి తరలించిన తర్వాత 1591లో చార్మినార్ను నిర్మించారు. ప్రతి ముఖం నాలుగు వీధుల్లో.. ఒక్కొక్క వీధి వైపు తెరుచుకునేటట్లు ఉంటుంది. చార్మినార్కు చెందిన నాలుగు నిర్మాణాలు ప్రధాన నిర్మాణంతో కలిపి నిర్మించారు. పై అంతస్తుకు చేరుకునేందుకు 149 మెట్లు ఉంటాయి. ఇక చార్మినార్ నుంచి ఉన్న నాలుగు ప్రధాన దారుల్లో లాడ్బజార్ (చుడిబజార్) ఒకటి. లాడ్ అంటే లక్క అని అర్థం. దీనిని గాజులు తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. కుతుబ్షాహీ వంశం, నిజాంరాజుల కాలం నుంచి ఉన్న ఈ గాజుల మార్కెట్ చాలా పాతది. ఇక చౌమహల్లా చౌమహల్లా ప్యాలెస్ మరొకటి. దీన్ని 1750లో దీనిని రెండో నిజాం సలాబత్ జంగ్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. నిజాం ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఇక్కడే జరిగేవి. చౌమహల్లా ప్యాలెస్ను ప్రత్యేక చారిత్రక నిర్మాణంగా గుర్తిస్తూ 2010 మార్చి 15న యునెస్కో ప్రతిష్టాత్మకమైన ఆసియా ఫసిఫిక్ మెరిట్ అవార్డును ప్రదానం చేసింది. ఈక్రమంలో వీటిని ప్రపంచ సుందరీమణులు సందర్శించం ద్వారా పర్యాటకంగా మరింత మేలు జరుగుతుందని తెలంగాణ సర్కారు భావిస్తోంది.
………………………………………………………