
* ఉద్యోగుల సెలవులు రద్దు.. మంత్రుల విదేశీ పర్యటనల రద్దు
* రక్త నిల్వలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు
* అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు..
* దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని సూచనల
* రేపు సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ
* రాజకీయాలు, పార్టీ లకు తావు ఉండొద్దు : రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీ లకు తావు లేదని తెలిపారు. అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేసి, ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రులు కూడా అందుబాటులో ఉండాలని, విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలని, శాంతి భద్రతల కు భంగం కలుగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
రక్తనిల్వలు, మందులపై అప్రమత్తం
బ్లడ్ బ్యాంకు ల్లో రక్తనిలువలు సిద్దం చేసుకోవాలని రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. అత్యవసర మెడిసిన్ సిద్దం చేసుకోవాలని తెలిపారు. రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ ల అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని, ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలన్నారు. సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలన్నారు. అటువంటి న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందన్నారు. రాజధాని లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల ను కమాండ్ కంట్రోల్ రూం కి అనుసంధానం చేయాలని, అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలని తెలిపారు. హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర, ఐటీ సంస్థల దగ్గర భధ్రతను పెంచాలని తెలిపారు. హైదరాబాద్ నగరం లో పోలీసులు అప్రమత్తంగా ఉంటూ, అవసరమైతే పీస్ కమిటీ లతో మాట్లాడాలని సూచించారు.
……………………………………………..