
* వెయ్యి గొంతులు – లక్ష డప్పులతో నినదిద్దాం
* సన్నాహక సమావేశంలో మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్, ఆకేరు న్యూస్ : ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ కోసం మాదిగలు ముప్ఫై యేండ్ల పాటు సుదీర్ఘమైన పోరాటం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థపాకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ముందుకొచ్చిన ప్రతి పార్టీకి మద్దతు తెలిపామన్నారు. నేను ఏ పార్టీలో చేరలేదని, భవిష్యత్తులో కూడా చేరను అన్నారు. ఇప్పటి వరకు నా కండువా మారలేదు, భవిష్యత్తులోనూ మారదన్నారు. మంగళవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో వెయ్యి గొంతులు – లక్ష డప్పుల పేరుతో మాదిగ కవులు, కళాకారులు, గాయకులు, రచయితలతో కలిసి సన్నాహాక సమావేశం నిర్వహించారు. జాతి కోసమే ఏ పార్టీకైనా మద్దతు ఇచ్చామని, ఏ పార్టీతోనైనా యుద్ధం చేశామన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కూడా మద్దతు ఇచ్చామని, చివరకు ప్రధానమంత్రి ఇచ్చిన హామీతో బీజేపీకి మద్దతు ఇచ్చామన్నారు. మేము చివరికి మద్దతు ఇచ్చింది బీజేపీకేనని తెలిపారు. మొదట టీడీపీకి, తరువాత కాంగ్రెస్, ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ పార్టీ లకు, అలాగే గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు కూడా మద్దతు ఇచ్చామన్నారు. మా నిర్ణయాలు మా జాతి కోసమే తప్ప వ్యక్తిగతం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అవిడఫిట్ దాఖలు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తద్వారానే ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైందన్నారు. కాంగ్రెస్ లో మాలలకు పలుకుబడి ఎక్కువగా ఉందని, దేశంలో మూడు పదవులు ఉన్న కుటుంబాల్లో గాంధీ కుటుంబం తరువాత మళ్ళీ మాలలకే ఉందన్నారు. ఖర్గే కుటుంబంలో మూడు పదవులు , వివేక్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నాయన్నారు. రెడ్డి కులస్తుల కుటుంబాలలో కూడా మూడు పదవులు లేవు కానీ, మాలలకి ఉన్నాయని, ఇది వారి పలుకుబడికి సాక్ష్యం అన్నారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి బలమైన ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇన్ని రోజులు తెర వెనుక ఉండి ఎస్సీ వర్గీకరణను అడ్డుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారన్నారు. వారి పలుకుబడిని ఉపయోగించి ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్నారన్నారు. వారికి లక్షల కోట్ల డబ్బులు , టీవీ, పేపర్, మీడియాతో పాటు రాజకీయ ప్రాబల్యం ఉందన్నారు. అలాంటి బలవంతులతో మాదిగలు పోరాడాల్సి వస్తుందని, ఎస్సీ వర్గీకరణ మీద రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నట్లు కనపడినప్పటికి ఆయన మీద మాలల ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. ఇటీవల మాదిగల మేధావుల సభలో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం కానీ అడ్డుకునే శక్తులు బలంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. నాటి కన్నా నేడు ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి మాలలు శక్తినంతా ప్రయోగిస్తున్నారన్నారు. అందువల్లే ఎస్సీ వర్గీకరణ జాప్యం జరుగుతుందన్నారు. ఈ అడ్డంకులను ఎదుర్కొని జాతిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. వివేక్ వెంకటస్వామి దగ్గర లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయని, అయితే మాదిగల దగ్గర లక్షల డప్పులు ఉన్నాయన్నారు. డబ్బులు ఉన్నోళ్ళ దగ్గర అధర్మం ఉన్నదని, డప్పులు ఉన్నోళ్ల దగ్గర ధర్మం ఉన్నదన్నారు. కనుక ధర్మమే గెలుస్తుంది ,ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుందన్నారు., ఈ అంతిమ పోరాటానికి డప్పులతోనే సిద్దం అవుదాం. ముప్పై ఏళ్ల పోరాటంలో కళాకారుల పాత్ర పరిమితంగా ఉందని, కానీ అంతిమ పోరాటంలో జాతిని గెలిపించాల్సిన బాధ్యత కళాకారులదే, కళా నాయకులదే అన్నారు. ఎస్సీ వర్గీకరణ మీద జరుగుతున్న కుట్రలను ఎదుర్కోవడానికి వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా ప్రదర్శన చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ చారిత్రక కార్యక్రమంలో కళాకారులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. జనవరి 3 నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి గొంతులు లక్ష డప్పులు విజయవంతం కోసం రథయాత్రలు ఆరంభం అవుతుందని, ఫిబ్రవరి 3 న ఛలో హైదరాబాద్ వెయ్యి గొంతులు లక్ష డప్పులు, మండే మాదిగ గుండెల చప్పుళ్ళు నిర్వహిస్తామన్నారు. 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం నుండి మహా ప్రదర్శన ప్రారంభమై నెక్లెస్ రోడ్ మీదుగా బయలుదేరి సంజీవయ్య పార్క్ నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న దండోరా కళామండలి జాతీయ అధ్యక్షుడు ఎన్ వై అశోక్ మాదిగ , ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ , ప్రజా వాగ్గేయకారులు దరువు ఎల్లన్న, గిద్దె రాంనసయ్య, నలిగంటి శరత్, గజ్జల అశోక్, పల్లె నరసింహులు రామంచ భరత్ , ప్రముఖ రచయిత పసునూరి రవీందర్, వాణి, శైలజ , అమూల్య, మల్లికా, అందే భాస్కర్ , పాటమ్మ రాంబాబు, టీపీసీసీ సాంస్కృతిక విభాగం నేత చక్రాల రఘు , డపొల్ల రమేష్, గజ్జెల అశోక్, డప్పు రామస్వామి, బరిగేలా బాబు, రావుగళ్ల బాబు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….