
* భక్తులకు ఇబ్బందుల్లేకుండా సమన్వయంతో పనిచేయాలి
* ఫీల్డ్ విజిట్ చేసి ప్రతిపాదనలు సమర్పించాలి
* మంత్రి సీతక్క
ఆకేరున్యూస్, ములుగు: వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో జరిగే మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టే పనులు శాశ్వతంగా నిలిచేలా పూర్తి చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధ్యక్షతన 2026 సంవత్సరంలో జరగనున్న మేడారం మహాజాతరను పురస్కరించుకొని అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ గతంలో లాగా జాతరకు రెండు నెలల ముందు పనులు ప్రారంభించి హడావుడిగా పనులు పూర్తి చేయకుండా కనీసం ఆరు నెలల సమయం తీసుకుని పూర్తి నాణ్యత పనులు ముగించాలని సూచించారు. వచ్చే సంవత్సరంలో మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర తో పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించడం జరుగుతుందని, రెండు పెద్ద పండుగలను పురస్కరించుకొని అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కుంభమేళ తరహాలో జరుగుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయడానికి కృషి చేయాలని, గత మహా జాతర సందర్భంగా మిగిలి ఉన్న 50 కోట్ల రూపాయలను రానున్న మహా జాతరకు వినియోగిస్తామని తెలిపారు. గద్దెల పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దరమే కాకుండా జంపన్న వాగుపై ఐదు కోట్ల రూపాయలతో పెద్దలు పిల్లలు సేద తీర్చుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని, ప్రణాళిక బద్ధంగా శాశ్వత పనులు చెయ్యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులకు అవసరం కానున్న పనులను ముందుగానే గుర్తించి సంబంధిత అధికారులు అంచనాలు తయారు చేయాలని, మహాజాతర సందర్భంగా రైతులకు అవగాహన నిర్వహించాలని అన్నారు. జాతర సందర్భంగా త్రాగునీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నిరంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత జాతరలో మేడారంలో జరిగిన ఇబ్బందులను సీసీ కెమెరాల పుటేజీల చూసి తద్వారా మేడారంలో ఏర్పాటు చేసి పనులను గుర్తించాలని, జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. మాట్లాడుతూ గతంలో జరిగిన మేడారం మహాజాతర సందర్భంగా పనిచేసిన అధికారులు ఇప్పటికీ జిల్లాలో పనిచేస్తున్నారని, వారి అనుభవాలను పరిగణలోకి తీసుకొని రానున్న మహాజాతరను విజయవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. పలు శాఖల ద్వారా చేపట్టనున్న పనులను గుర్తించి అంచనాలను తయారు చేస్తామని, గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
…………………………………………….