* ములుగు జిల్లా ఎస్పీ శబరిష్.పి
ఆకేరు న్యూస్, ములుగు: జిల్లా వ్యాప్తంగా పోలీసులు విధి నిర్వహణలో నిబద్ధత కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ శబరిష్ సూచించారు. ములుగు జిల్లా కేంద్రం లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటుచేసిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో మొదటగా జిల్లా ఎస్పీ అధికారులతో మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధతను కలిగి ఉండాలని, పక్షపాతం లేకుండా సమానత్వం పాటించాలని, బాధితులందరినీ ఒకే విధంగా చూడాలని అందరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. కోర్టులో ట్రయల్ లో ఉన్న కేసుల గురించి ఆరా తీసి, ప్రతికేసులోను తప్పనిసరిగా సాక్షులకు, ముద్దాయిలకు సమన్లు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. నేరస్తులకు శిక్ష పడే విధంగా కోర్టు కానిస్టేబుల్ లు విధులు నిర్వహించాలని, అంతిమంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్, సస్పెక్ట్ షీటర్స్ గురించి ఆరా తీసి, వారిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలని, వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలన్నారు. ఈ నెలలో నమోదైన కేసుల వివరాలపై పోలీస్ స్టేషన్ ల వారీగా ఆరా తీసి, కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రతి కేసులోనూ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఫైల్ అప్డేట్ చేయాలనికోరారు.
దొంగతనాలు, ఆర్థిక నేరాలలో ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా దర్యాప్తును ముమ్మరం చేయాలని, పోగొట్టుకున్న నగదు లేదా వస్తువులను బాధితులకు అప్పగించేలా కృషి చేయాలి అని ఆదేశించారు. అదే విధంగా జిల్లాలో ఇసుక అక్రమ రవాణ పైన నిఘా ఉంచాలని అన్నారు. చెక్ పోస్టులలో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇసుక అక్రమ రవాణా ను కట్టడి చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు ఏర్పాటుపై ప్రజలలో అవగాహన తీసుకొని వచ్చి కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాలను నివారించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై జరిగే నేరాలలో వీలైనంత త్వరగా విచారణ చేసి పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. యువత ఆన్లైన్ బెట్టింగ్ వలలో పడి మోసపోకుండా పోలీస్ స్టేషన్ ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ ని ప్రోత్సహిస్తే వల్ల పైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. యువత, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా సైబర్ క్రైమ్ నేరాలపై ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధి లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్ బి ఇన్స్పెక్టర్ శంకర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కుమార్, సిఐ ఏటూరునాగారం శ్రీనివాస్ , సిఐ ములుగు సురేష్, సిఐ వెంకటాపురం రమేష్, సిఐ పస్రా దయాకర్, ఎస్ఐ ములుగు వెంకటేశ్వరరావు, ఎస్ఐ వెంకటాపూర్ రాజు, ఎస్ఐ పస్రా కమలాకర్, ఎస్ఐ తాడ్వాయి శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ ఏటూరునాగారం రాజ్ కుమార్, ఎస్ఐ మంగపేట సురేష్, ఎస్సై కన్నాయిగూడెం వెంకటేష్, ఎస్ఐ వాజేడు సతీష్ , ఎస్ఐ పేరూరు కృష్ణ ప్రసాద్, ఎస్సై వెంకటాపురం తిరుపతి, డిసిఆర్బి ఎస్సై జగదీష్, మరియు ఐటీ కోర్ టీం, డిసిఆర్బి సిబ్బంది పాల్గొన్నారు.

…………………………………………………………………
