* ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే మంత్రి గారు ఆర్టీసీ ఎండీ శ్రీ నాగిరెడ్డి, రవాణా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, పోలీస్ మరియు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ప్రమాద పరిణామాలను సమీక్షించారు. గాయపడిన వారికి తక్షణం అత్యవసర వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, తీవ్రమైన గాయాలపాలైన వారిని వెంటనే హైదరాబాద్కు తరలించి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు మంత్రి గారు ఆర్టీసీ అధికారులు, రవాణా కమిషనర్, ఫైర్ సర్వీస్ డీజీలను ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రమాదానికి కారణమైన అంశాలపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి గారు ఆదేశించారు. ప్రయాణికుల ప్రాణ రక్షణ అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంత్రి గారు హృదయపూర్వక సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని తెలిపారు.ప్రభుత్వం ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్లు: 9912919545, 9440854433. ప్రయాణికుల కుటుంబ సభ్యులు లేదా బంధువులు వీటి ద్వారా సమాచారం పొందవచ్చని తెలిపారు. ప్రమాదంలో గాయ పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. ప్రభుత్వం నుండి రూ 5 లక్షలు+ఆర్టీసీ నుండి రూ 2 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాగా చేవెళ్ల ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.
…………………………………
