
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఆధునిక హంగులతో నిర్మితమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ను వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, సోమన్న, కిషన్ రెడ్డి, బండి సంజయ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును రూ. 428 కోట్లతో చేపట్టారు. 19 ట్రాక్లు, ఐదు లిఫ్ట్లు, ఐదు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్గా ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్ తయారీకి అనుమతి ఇవ్వాలి. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సహకరించాలని కోరుతున్నాను. మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. రీజనల్ రైలు కూడా అవసరం ఉంది. రైల్ రింగ్కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి.
ప్రధాని కోరుకుంటున్న 5 ట్రిలియన్ ఎకానమీ సాకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలి. తెలంగాణ రాష్ట్రం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటుంది. డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తే రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. 1 ట్రిలియన్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేసేందుకు మాకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనవరి 7 నుంచి సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్- సికింద్రాబాద్ (12757-12758), గుంటూరు- సికింద్రాబాద్- గుంటూర్ ఎక్స్ప్రెస్ (17201-17202), సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్నగర్- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్(17233-17234) రైళ్లకు చర్లపల్లిలో అదనపు స్టాపేజ్ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లి వచ్చే రైళ్లు (12603-12604) మార్చి 7 నుంచి,. గోరఖ్పూర్- సికింద్రాబాద్ వెళ్లి వచ్చే రైళ్లు (12589-12590) మార్చి 12 నుంచి చర్లపల్లి టెర్మినల్ నుంచే రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పారు.
……………………………………………………..