
* భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: సరస్వతి పుష్కరాలకు చేపట్టనున్న తాత్కాలిక ఏర్పాట్లకు సంబంధించిన అంచనా ప్రతిపాదనలు త్వరితగతిన సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యుఎస్, విద్యుత్, దేవాదాయ, పర్యాటక ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. గతంలో శాశ్వత పనులకు అంచనాలు అందచేసారని, కానీ కొన్ని తాత్కాలిక పనులు చేపట్టాల్సి ఉన్నందున ప్రతిపాదనలు అందచేయాలని తెలిపారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పుష్కరాలలో చేసిన ఏర్పాట్లు సమాచారం భక్తులకు ఉపయోగపడేలా మొబైల్ యాప్ తయారు చేయు అంశాలను పరిశీలించారు. మొబైల్ యాప్ లో సమగ్ర సమాచారం ఉండాలని సూచించారు. టెంట్ సిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రధాన కూడళ్లలో తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించేందుకు జోన్లుగా వారిగా విభజించి, ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని డిపిఓకు సూచించారు. ప్రవేశ మార్గాలు, రోడ్లు మరమ్మతులు, మెరుగుదల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్ సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని అవసరమైన మేరకు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటుతో పాటు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, మార్చు పనులను చేపట్టాలని విద్యుత్ అధికారులకు సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద భద్రతా చర్యలు మరింతగా పెంచాలని, భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు సిబ్బందిని ఏర్పాటుతో పాటు పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. గోదావరిలో చలువ పందిళ్లు వేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ స్థలాలు వద్ద మరుగుదొడ్లు, మంచినీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రచారానికి తయారు గోడ పత్రికల్లో భక్తులు పుష్కర సమాచారం తెలుసుకోవడానికి అనువుగా క్యూ ఆర్ కోడ్ ముద్రించాలని సూచించారు.
………………………………………….