ఆకేరున్యూస్, డెస్క్ : లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధితోపాటు ప్రియాంక గాంధి వాద్రా శివసేన నాయకుడు సంజయ్ రౌత్, అఖిలేష్ యాదవ్(AKHILESH YADAV), సీనియర్ జర్నలిస్ట్ సాగరికా ఘోష్తోపాటు పలువురు నేతలను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్లో ఓటర్ల జాబితా సవరణ(SPECIAL INTENSIVE REVISION) ప్రక్రియ, 2024 ఎన్నికల్లో ఓట్ల మోసాలకు పాల్పడ్డారంటూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో నేతలంతా కలిసి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి నిరసన తెలుపుతూ బయలుదేరారు.ఓటర్ల జాబితా సవరణలు, ఓట్ల చోరీ అంశాలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వీరంతా ఆందోళనకు దిగారు.అయితే ఈ నిరసన మధ్యలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళన సాగుతున్నప్పటికీ, పోలీసు బలగాలు ముందు జాగ్రత్తగా పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని బస్సులోకి ఎక్కించారు. ఇందులో రాహుల్ గాంధీ(RAHUL GANDHI), ప్రియాంక గాంధీ(PRIYANKA GANDHI), సంజయ్ రౌత్(SANJAY ROUTH), సాగరికా ఘోష్ (SAGARIKA GHOSH)వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమి నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని, ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత లేదని వారు విమర్శించారు. ఈ నిరసన ద్వారా ఎన్నికల సంస్కరణలపై దృష్టి సారించాలని, ఓటర్ల హక్కులను కాపాడాలని ఇండియా కూటమి నేతలు పిలుపునిచ్చారు.
…………………………………..
