
* బ్రిటన్ మాజీ ప్రధానితో సీఎం రేవంత్ భేటీ
* ‘తెలంగాణ రైజింగ్ 2047 గురించి వివరణ
* రేవంత్ విజన్ పై టోనీ ప్రశంసలు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ 2047 ను బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ది కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికల గురించి సీఎం టోనీ బ్లెయిర్ కు వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 గురించి టోనీ బ్లెయిర్ కు వివరించారు.టోనీ బ్లెయిర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత, ప్రపంచ నాయకుల విజన్, వ్యూహరచన, వాటి అమలుకు సహాయపడాలనే లక్ష్యంతో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBIGC)ను స్థాపించారు. ప్రజా ప్రభుత్వం రూపొందించిన విజన్ అమలులో సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో రైతులు, యువత, మహిళలు వంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు.. తెలంగాణ కోర్ అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల వారీగా అభివృద్ధి కోసం సూక్ష్మ ప్రణాళికను సరికొత్తగా రూపొందిస్తున్నట్టు తెలిపారు.సుస్థిరత సూత్రాలతో తెలంగాణ అభివృద్ధి ఎజెండా దృఢంగా ఉందని ఈ సందర్భంగా టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి ప్రధాన కార్యక్రమాలపై టోనీ బ్లెయిర్ ప్రత్యేక ఆసక్తిని వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.
……………………………….…………………….