
* కార్పొరేట్ రంగు బహిరంగం చేశారు..
* చందాల దందాతో నోర్లు పడిపోయిన రాజకీయ పార్టీలు
* అడ్వర్టైజ్మెంట్ ఆశలతో చేష్టలుడిగిన మీడియా
* విద్యార్థుల సమస్యలు పట్టని విద్యార్థి సంఘాలు
* మార్కులు, ర్యాంకులు తప్ప పిల్లల గోస ధ్యాస లేని తల్లిదండ్రులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : 1, 2, 3, 4, 5, 6… ఇలా ర్యాంకులతో ఊదరగొట్టే కార్పొరేట్ కళాశాలల అసలు బాగోతం బయటపడింది. ర్యాంకులతో బిజినెస్ చేస్తూ, విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న వైనంపై చర్చ జరుగుతోంది. పురుగులు, బొద్దింకలు, వర్షపు నీటి చెమ్మకు నానుతున్న పరుపులు, బాత్రూమ్లో జెర్రిలు.. ఇవన్నీ ఏ ప్రభుత్వ లేదా మారుమూల వసతి గృహాల్లో కాదు.. లక్ష, లక్షన్నర ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ హాస్టళ్లలోని పరిస్థితులు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వసతి గృహాన్ని పరిశీలిస్తే.. అది కార్పొరేట్ హాస్టలా.. కార్ఖానానా అనే అనుమానం కలగకమానదు. 800 మంది విద్యార్థినులు ఉన్న ఆ కార్పొరేట్ వసతి గృహంలో.. ‘సగం బాత్రూమ్లకు తలుపులు లేవు.. సింకుల్లో నుంచి నీళ్లు పోవడం లేదు.. ఫలితంగా దుర్గంధం వ్యాపిస్తోంది..’ అని ఆ హాస్టల్ను సందర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద వద్ద ఆ విద్యార్థినులు తమ గోడు వెలిబుచ్చారు.
చర్చనీయాంశంగా శ్రీచైతన్య, నారాయణ..
శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలలు, వసతి గృహాలు సైతం అధ్వానంగా ఉన్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘అమ్మా.. ఇక్కడ మంచి నీళ్లు సరిగా లేవు.. గదుల్లో బొద్దింకలు వస్తున్నాయి.. బాత్రూంకు వెళ్లాలన్నా ఇబ్బంది ఉంటోంది..’ అంటూ తల్లికి బిడ్డ తన ఆవేదనను వెళ్లగక్కుతున్నా.. ‘కావాలనే చాడీలు చెబుతున్నావు.. నీకు చదువుపై శ్రద్ధ లేక ఇలా అంటున్నావు..’ అని బిడ్డనే కొందరు తల్లులు అనుమానిస్తున్న దుస్థితి ఉంది. అందుకు కారణం ఆ కార్పొరేట్ కాలేజీలకు ఉన్న పేరు ప్రఖ్యాతలు. హంగు, ఆర్భాటాలు. అసలు విషయం వెలుగులోకి వచ్చాక కొందరు తల్లిదండ్రులు వాటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ మంచిగా చదువు కోవాలని, ఆరోగ్యంగా, సౌకర్యవంతంగా ఉండాలని స్థోమతకు మించి లక్ష, లక్షన్నర ఫీజులు ఇస్తున్నా.. ఎందుకీ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పురుగులు.. మురుగునీళ్లు..
‘తాగేనీళ్లలో పురుగులు వస్తున్నాయట.. వాటర్ ట్యాంక్లో మురుగు నీళ్లు.. వాటిని చూసి ఒక్కోసారి స్నానం కూడా చేయడం లేదట.. 5 ఫ్లోర్స్ ఉన్నాయి.. బాత్రూమ్ను, బెడ్రూమ్ ను పరిశీలిస్తే ఒక్కరోజు పిల్లలను ఇక్కడ ఉంచరు. చాలాసార్లు పాములు వచ్చాయట.. జర్రిలు వచ్చాయట. బెడ్స్ కింద బొద్దింకలు ఉన్నాయి. అన్నంలో నీళ్లు ఉంటాయట. నీళ్ల సాంబార్ ఇస్తున్నారట. అన్నంలో పురుగులు వస్తున్నాయట. విద్యార్థులు అడిగితే.. అవి పురుగులు కాదు.. బ్లాక్ ఇలాచీ, లవంగం అని చెబుతారట. లంచ్ బ్రేక్ అరగంట ఇస్తారంట. అరగంటలో తినాలి, వాష్ రూమ్కు వెళ్లాలి.. రావాలి.. ఎలా సరిపోతుంది ఆ సమయం. పిల్లలు ఏడ్చేశారు.. 24/7 చదవమని, ఒకరితో పోల్చి మమ్మల్ని బూతులు తిడుతున్నారని. కాలం చెల్లిన మందులను ఇస్తున్నారట. మూడే మందులు ఇస్తారంట. ఇక్కడి ఫుడ్ తిని తిని ఊపిరితిత్తుల సమస్యతో రక్తపు వాంతులు చేసుకుంటే, జిందా తిలిస్మాత్ వాటర్ తాగించి, నీకు చదువుపై శ్రద్ధ లేక ఇలాంటి డ్రామాలు అడుతున్నావని పంపించారట..’ అని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద కార్పొరేట్ హాస్టల్లోని బండారం బయటపెట్టడంతో అది గమనించిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. లక్షలు పోసి అలాంటి చోట తమ పిల్లలను చదివిస్తున్నామని కుమిలిపోతున్నారు.
బయటకు పంపక యూరిన్ ఇన్ఫెక్షన్లు
శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలలు, హాస్టళ్లలోని దుస్థితిని నేరేళ్ల శారద వెలుగులోకి తెచ్చారు. ర్యాంకులే ధ్యేయంగా 3 గంటల పాటు స్టడీ అవర్ నిర్వహిస్తున్నారు. ఆ మూడు గంటల సమయంలో వాష్ రూమ్ వెళ్లాల్సిన వచ్చినా పంపరట. ఒక్కో సమయంలో ఆపుకోవాల్సి రావడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని విద్యార్థులు వాపోతుండడం దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. 3 నుంచి 10 సార్లు ఇంపోజిషన్లు ఇస్తుండడంతో అర్ధరాత్రి 2, 3 వరకు విద్యార్థులు రాస్తూనే ఉంటున్నారు. మళ్లీ 5.30కే స్టడీ అవర్ కోసం లేవాల్సి వస్తోంది. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను నేరేళ్ల శారద వెలుగులోకి తెచ్చారు. అయినా.. ఈ పరిస్థితిపై రాజకీయ పార్టీల నోళ్లు వినిపించడం లేదు. చందాల దందా కారణంగా అవి మూగబోయాయి. అడ్వర్టైజ్మెంట్ల ఆదాయం రాదన్న భయంతో ప్రధాన మీడియాలో ఎక్కడా ఈ సమస్యలకు ప్రాధాన్యం లేదు. కొన్నింట్లో ప్రచురితమైనా, ఆ కళాశాలల పేర్లతో రాసే దమ్ము లేదు. విద్యార్థి సంఘాలకు సైతం ఆ సమస్యలపై నిరసనలు వ్యక్తం చేయడం లేదు. మార్కులు, ర్యాంకులు తప్ప పిల్లల గోస ధ్యాస లేని కొందరు తల్లిదండ్రులు కూడా మౌనం వహిస్తున్నారు.
అవన్నీ పరిశీలించాకే మీ పిల్లలను చేర్పించండి..
ర్యాంకుల కోసం ఆయా కళాశాలల నిర్వాహకుల ఒత్తిడి కారణంగా పిల్లలు భయపడుతున్నారని, పీసీఓడీ సమస్యలతో పాటు, మూడు, ఐదు నెలలైనా పీరియడ్స్ రావడం లేదంటే వారి మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. కేవలం చదవడం.. ర్యాంకులే కాదని, పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో దృష్టి పెట్టాలని కోరారు. బాత్రూమ్ చెక్ చేయాలి.. తినే భోజనం చెక్ చేయాలి.. అన్నీ చూపిస్తేనే తాము.. పిల్లలను చేర్పిస్తామని నిర్వాహకులకు చెప్పాలని తెలిపారు. విద్యా సంస్థలు విద్యను బిజినెస్ చేసుకుంటున్నాయని, ప్రభుత్వంతో రిలేషన్ మెయింటైన్ చేసుకుంటే తమకు ఎలాంటి సమస్యా రాదనే ఆలోచిస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులే జాగ్రత్త వహించాలని వెల్లడించారు. ఇదిలా ఉండగా, వరుస తనిఖీలు చేసి కార్పొరేట్ కళాశాలల బండారాన్ని బయటపెట్టిన నేరేళ్ల శారద సంచలనంగా మారారు. అధికారాలు అసలే లేకుండా కేవలం అలంకార ప్రాయాలు గా నామినేటెడ్ పోస్టులు మారిన ఈ కాలంలో వాటికున్న పవర్ను చాటి చెప్పారు.
……………………….