ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్స్ ఏర్పాట్లు, టేబుల్స్ అమరిక, కౌంటింగ్ సిబ్బంది ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, త్రాగునీరు, మూత్రశాలల సదుపాయాలు, విద్యుత్ సరఫరా ఇతర మౌలిక వసతులపై అదనపు కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, చట్టబద్ధంగా ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికలలో అత్యంత కీలక దశ అని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, పూర్తి పారదర్శకతతో సమయపాలనతో కౌంటింగ్ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్డిఓ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మాస్టర్ ట్రైనర్లు అధికారులు పాల్గొన్నారు.
