
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోని శాస్త్ర విజ్ఞాన నైపుణ్యంతో చదవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్ఫోసిస్ సంస్థ చే ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ల్యాబ్ ను సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటినుండే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధన దిశగా ముందుకు సాగాలని అన్నారు. తాను కూడా ప్రాథమిక, ఉన్నత విద్య జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ములుగు యందు చదువుకున్నానని ఆ రోజుల్లో ఎస్టీ హాస్టల్ యందు ఉండి, పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చేవారని చదువుపై ఉన్న ఆసక్తితో తాను పి హెచ్ డి పూర్తి చేశానని, ఉన్నత లక్ష్యాలను సాధించడానికి పేదరికం అడ్డు కాదని విద్యార్థులు గుర్తించాలని సూచించారు. చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత సహాయం చేయాలని ఉద్దేశంతో ఇన్ఫోసిస్ సంస్థ ద్వారా 10 కంప్యూటర్లను అందజేయడం జరిగిందని విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే సాంకేతిక విద్యను పెంపొందించుకొని ఉత్తమ లక్ష్యం దిశగా ముందుకు సాగాలని మంత్రి తెలిపారు. అనంతరం పాఠశాలలో ఆరు లక్షల నిధులతో మూడు టాయిలెట్ బ్లాకుల నిర్మాణ పనులను మంత్రి సీతక్క, కలెక్టర్ తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి చంద్రకళ, సెక్టోరల్ అధికారులు అర్షం రాజు, గ్యాదరి రమాదేవి, గుల్లపల్లి సాంబయ్య, డి ఎస్ ఓ జయదేవ్, మండల విద్యాశాఖ అధికారి వజ్జ తిరుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………