* మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో రచ్చ…
* బీఆర్ఎస్ వాకౌట్.. ప్రభుత్వంతో కేటీఆర్ సవాల్ ప్రతిసవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో నేడు మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు అంశంపై తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా జరిగిన చర్చలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.
మాది దోపిడీపై పోరాటమే-కేటీఆర్
సభలో చర్చ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తాము మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, కేవలం ఆ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం చేస్తున్న ‘దోపిడీ’ని మాత్రమే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (Detailed Project Report) ఇంకా సిద్ధం కాలేదని స్వయంగా ఎండి తెలిపారని, కానీ ప్రభుత్వం మాత్రం ఉందని అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చివేస్తూ, వారి కన్నీళ్లపై ప్రాజెక్టు నిర్మించడం సరికాదని కేటీఆర్ మండిపడ్డారు.
అసత్యాలు చెబుతున్నారు.
మంత్రుల కౌంటర్:
కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డీపీఆర్ ఇప్పటికే పూర్తయిందని, ఎండీ నరసింహారెడ్డి ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించారని పేర్కొన్నారు. కేటీఆర్ కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సవాల్ విసురుతూ.. వెలుగుమట్ల వంటి ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. నిజాలు తెలిస్తే కేటీఆర్ తలదించుకోవాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
నిరసనగా వాకౌట్:
ప్రభుత్వ సమాధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మూసీ ప్రాజెక్టు వ్యయాల్లో పారదర్శకత లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో అసెంబ్లీలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
