
* తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టింది ఆయన నాయకత్వంలోనే
* ఆయనకు భారతరత్న ఇవ్వాలి : రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh)ఈనెల 26న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయనకు సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది మన్మోహన్ నాయకత్వంలోనేనని తెలిపారు. దేశానికి ఆయన విశిష్ఠ సేవలు అందించారని, అలాంటి వ్యక్తికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని రేవంత్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా సేవలందించారు. పదేళ్లపాటు దేశానికి ప్రధానిగా పనిచేసిన ఆయన మరణం తీరని లోటన్నారు. తెలంగాణతో ఆయన బంధం విడదీయరానిదన్నారు.
రైతులకు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని మన్మోహన్
రైతులకు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని మన్మోహన్ సింగ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశ సంక్షేమం దృష్య్టా అణుఒప్పందం చేసుకున్నారని, సోనియా సూచనల మేరకు ఆయన గొప్ప చట్టాలు చేశారన్నారు. విప్లవాత్మకమైన భూసేకరణ చట్టం తెచ్చింది ఆయనేనని తెలిపారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే గ్రామీణ ఉపాధి హామీ చట్టం తెచ్చారనిన్నారు.
…………………………………………