* రెండు గంటల్లో 18.37 శాతం నమోదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఓటర్లు ఉదయం నుంచే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. చలిని లెక్కచేయకుండా వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయమే తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్నది. ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నికలను సైతం చేపడుతారు. తొలి విడుతలో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇందులో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగతా 3,834 సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తుండగా.. 12, 960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని విధాలా చర్యలు చేపట్టారు. మొత్తంగా మూడు విడుతల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల కోసం 93,905 మంది సిబ్బందిని నియమించినట్టు ఎస్ఈసీ కమిషనర్ పేర్కొన్నారు. పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు చేపడతారు. గెలిచిన అభ్యర్థులను ప్రకటించిన అనంతరం వెంటనే ఉప సర్పంచులకు ఎన్నుకోనున్నారు.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
