
* మజ్లిస్ దేశద్రోహ పార్టీ
* మతం కోణంలో అడ్డుకుంటే ప్రజలే తిరగబడతారు
* దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోం
* కరీంనగర్లో బండి సంజయ్ను సన్మానించిన న్యాయవాదులు
ఆకేరున్యూస్, కరీంనగర్: భారత రాజ్యాంగానికి భవిష్యత్లో ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం జాతీయవాద భావజాలంతో పనిచేస్తోందన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు పై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. ఒవైసీసహా కుహానా లౌకిక వాదులు ఎంత అడ్డుకున్నా పార్లమెంట్ లో అతి త్వరలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం పొందుతుందని స్పష్టం చేశారు. దేశం ప్రజల కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోదని ఉద్ఘాటించారు. కరీంనగర్ లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం బండి సంజయ్ రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులంతా బండి సంజయ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్, కార్యదర్శి బేతి మహేందర్, బాస సత్యనారాయణ, కోమాల ఆంజనేయులు తదితరులు హాజరై ప్రసంగించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొన్న. 109 కేసులు నాపై ఉన్నాయి. పలుమార్లు జైలుకు పోయిన. ప్రతిసారి నన్ను కాపాడుతోంది న్యాయవాదులే. వారి సంక్షేమం కోసం అన్ని విధాలా సహకరిస్తా. న్యాయవాదుల కాన్ఫరెన్స్ కోసం సీఎస్సార్ ఫండ్స్ నుండి మరో రూ.50 లక్షల సాయం చేసేందుకు నావంతు క్రుషి చేస్తానన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు పై మజ్లిస్ నేత ఒవైసీ అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. దేశమంతా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు పలుకుతున్నరు. ఒవైసీలాంటి ఎంత మంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదు. పార్లమెంట్ లో ఆమోదించి తీరుతామన్నారు.ఈ దేశ ప్రజల ఆస్తిపాస్తులు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. దేశమంతా తిరిగి అభిప్రాయాలను సేకరించాం. పార్లమెంట్ సంఘం సమావేశమై నివేదిక కూడా సమర్పించింది. అతి త్వరలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందడం తథ్యమన్నారు.
………………………………….