
– రసాయన కాలుష్యంతో పెను ప్రమాదం
– ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తలు
ఆకేరు న్యూస్ ప్రత్యేక ప్రతినిధి :
పీల్చేగాలి.. తినే తిండి.. తాగేనీరే కాదు.. పండించే పంటకు వినియోగిస్తున్న నీటి వల్ల కూడా అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. మానవ తప్పిదాలతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేయాల్సింది పోయి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫార్మా, బల్క్డ్రగ్ వంటి పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలను మూసీలోకి వదిలేస్తున్నారు. ఆ నీటితో పండించే వ్యవసాయ ఉత్పత్తులు, ప్రధానంగా ఆకుకూరలు విషపూరితంగా మారుతున్నాయి.
మూసీ నీళ్లల్లో..
హైదరాబాద్ మహా నగర నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న మూసీనది పరిసర ప్రాంతాల్లో కొన్ని పంటలు పండుతున్నాయి. మూసీ నీళ్లతోనే వాటిని పండిస్తుంటారు. ప్రధానంగా ఆకుకూరలను ఎక్కువగా పండిస్తుంటారు. వాటినే నగరంలోకి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అయితే.. మూసీ నీటిలో ఇళ్లు, అపార్ట్మెంట్ల సీవరేజ్ వ్యర్థాలే గాకుండా.. కంపెనీల రసాయన జలాలు నేరుగా కలుస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు నిబంధనల ప్రకారం తమ కంపెనీల నుంచి వచ్చిన వ్యర్థ జలాలను ట్రీట్మెంట్ ప్లాంట్లకు పంపి శుద్ధి చేయిస్తుండగా, మరికొన్ని పరిశ్రమలు వ్యర్థ రసాయనాలను యథేచ్చగా మూసీలోకి వదిలేస్తున్నాయి. ఇది ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
మానవాళిపై పెనుప్రభావం
రసాయన పరిశ్రమల నుంచి విడుదలైన వ్యర్థాలు కలిసిన నీటితో పండించిన వ్యవసాయ ఉత్పత్తుల వల్ల మానవాళికి దీర్ఘకాలికంగా పెనుప్రభావం చూపుతాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతంలో సాగుచేసిన ఆకుకూరల్లో రసాయన మూలాలు ఉండే అవకాశం ఉందని, రసాయన వ్యర్థజలాలు కలిసిన నీటిని పంటల సాగుకు వినియోగించినట్లయితే ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు. కలుషిత జలాల్లో ఉండే సల్ఫేట్, నైట్రేట్, హెవీ మెటల్స్ (లెడ్, క్రోమియం) ఆకుకూరల రూట్స్లోకి వెళ్తాయి. వాటిని తినడం ద్వారా మనుషుల శరీరంలోకి చేరతాయి. ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, లంగ్స్ ఇన్ఫెక్షన్లు రావడం, శ్వాసకోశ సమస్యలు, ఎముకలు బలహీనంగా మారడం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే, దీర్ఘకాలంలో జెనెటిక్స్ సమస్యలు ఏర్పడి పుట్టబోయే పిల్లలకు శారీరక, మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఓయూ పరిశోధనలో ఇలా..
ఉస్మానియా యూనివర్సిటీ జియోఫిజిక్స్ విభాగం సెంటర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ మూసీనది వెంట భూగర్భజలాలపై గతంలోనే మూడేళ్లపాటు పరిశోధనలు చేసింది. రుతుపవనాలు రాకముందు, వచ్చిన తర్వాత పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాల పరిస్థితిపై అధ్యయనం చేసింది. 50మీటర్ల లోతు వరకు మూసీనది పరివాహక ప్రాంతంలో ఇరువైపులా అరకిలోమీటర్ చొప్పున భూగర్భ జలాలన్నీ కలుషితమైనట్లు గుర్తించింది. ఇవి మానవ అవసరాలకు, వ్యవసాయానికి వినియోగించేందుకు ఏమాత్రం పనికిరావని స్పష్టం చేసింది. ఈ జలాలతో వ్యవసాయ ఉత్పత్తులను పండిస్తే ప్రతికూల ప్రభావం చూపుతాయని ఓయూ జియో ఫిజిక్స్ విభాగం పరిశోధన గతంలోనే స్పష్టమైంది.
………………………………………………