
* హాస్పిటల్ యాజమాన్యాలకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
* ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత పై వెనక్కి తగ్గాలని సూచన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆరోగ్య శ్రీ నిలివివేయడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మానవీయ కోణంలో హాస్పిటల్ యాజమాన్యాలు ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరించాలపి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితి ఐదు లక్షల నుండి పది లక్షల పెంచామన్నారు. గడిచిన 21 నెలల్లో 1779 కోట్ల రూపాయలను ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22 శాతానికి పైగా పెంచిందన్నారు.కొత్తగా 163 రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్య శ్రీ లో చేర్చి పేదలకు ఇబ్బందులు లేకుండా మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు.కొత్త ప్యాకేజీల చేర్పుతో అదనంగా 487.29 కోట్ల రూపాయలు పేదలకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి అన్నారు.2014-23 నవంబర్ వరకు సగటున నెలకు 57 కోట్ల రూపాయలు హాస్పిటల్ లకు చెల్లించగా 2023 డిసెంబర్ నుండి 2024 డిసెంబర్ వరకు సగటున 75 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.ఇప్పటికే రెండు రోజుల్లోనే 100 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్ లకు విడుదల చేశారని. ఆ డబ్బులు హాస్పిటల్ ఖాతాలో జమ అయ్యాయని అన్నారు పెండింగ్ డబ్బులు విడతల వారిగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆస్పత్రుల యాజమాన్యలు అర్థం చేసుకోవాలని కోరారు.
………………………………………….