
* పద్మశ్రీ అవార్డు అణగారిన వర్గాలకు దివ్యాంగులకు దక్కిన గౌరవం
* మరింత బాధ్యత పెరిగింది
* పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తనకు వ్యక్తిగతంగా ఇచ్చినట్లేగా తాను భావించను అని మందకృష్ణ మాదిగ (Mandda Krishna Madiga) అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిగను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఈ నేపధ్యంలో నాగోల్లోని శుభం కన్వెన్షన్ సెంటర్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య అధ్యక్షతన గురువారం మంద కృష్ణమాదిగకు సన్మాన సభను నిర్వహించారు.ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డును తాను అందుకున్నప్పటికీ అది యావత్ మాదిగలు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు దక్కినదిగా తాను భావిస్తానని అన్నారు.1994లో ఒక కులం కోసం ప్రారంభమైన తన పోరాట ప్రస్థానం అణగారిన అన్ని వర్గాల కోసమూ సాగిందని వివరించారు. ఈ పద్మశ్రీ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మంద కృష్ణమాదిగతో పాటు ఆయన సతీమణి జ్యోతిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముసాయిదా కమిటీ, వీహెచ్పీఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ ఎల్.గోపాల్రావు, కో చైర్మన్ అందె రాంబాబు, జాతీయ కమిటీ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, మహిళా అధ్యక్షురాలు ఎస్.భవానీ చౌదరి, వీహెచ్పీఎస్ ఏపీ అధ్యక్షుడు అన్యం చిన్న సుబ్బయ్య యాదవ్, ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్మాదిగ, ప్రధానకార్యదర్శి ఉపేందర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
………………………………………….