ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారీ వర్షాలు ఢిల్లీని కుదిపేస్తున్నాయి. ద్వారకలో ఓ ఇంటిపై చెట్టు కూలడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో తల్లి, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరొకరికి గాయాలు అయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. నజాఫ్గఢ్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో తల్లి జ్యోతి సహా ముగ్గురు పిల్లలు మరణించగా..తండ్రి మాత్రం గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది. ఇక ఢిల్లీ(Delhi)లోని ద్వారక, ఖాన్పూర్, మింటో రోడ్, లజ్పత్ నగర్, సౌత్ ఎక్స్టెన్షన్ రింగ్ రోడ్, మోతీ బాగ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్ని జలమయంగా మారాయి. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్థంభాలు కూలిపోవడంతో విద్యుత్ వ్యవస్థకు కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(Airport)లోకి భారీగా వర్షం నీరు చేరడంతో.. సుమారు 100కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలుస్తోంది.
………………………………………………..
