ఆకేరు న్యూస్ స్టేషన్ ఘన్ పూర్:
సరదాగా నీటిలోకి దిగి ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ లో గురువారం రాత్రి జరిగింది. విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మృతుల కుటుంబాలను శుక్రవారం పరామర్శించారు.
చిల్పూర్ మండలం వంగాలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు గూటం అకిరానందన్ (14), నూనె మనోజ్ కుమార్ (13) సరదాగా ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందారు. వంగాల పెళ్ళికి చెందిన ఇద్దరు చిన్నారులు నస్కల్ వాగులో సరదాగా ఈత కొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు నీట మునుగుతున్న ఒకరిని కాపాడబోయి మరొకరు మృత్యువాత పడ్డారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తీసుకురాగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిన్నారులకు నివాళులు అర్పించారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. శోకసంద్రంలో మునిగిన చిన్నారుల తల్లిండ్రులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
ఎమ్మెల్యే వెంట చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, స్థానిక సర్పంచ్ భూక్యా మేనకా సుధాకర్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
