
* కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. నకిరేకల్ పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం లేకున్నా సోషల్మీడియా వేదికగా తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజిత, మరో వ్యక్తి ఉగ్గిడి శ్రీనివాస్ వేర్వేరుగా నకిరేకల్ పోలీస్ స్టేషన్(Nakirekal Policestation) లో ఫిర్యాదుచేశారు. పేపర్ లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం ఉందంటూ తెలుగు స్క్రైబ్లో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. చౌగోని రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ (FIR)నెంబర్ 85/2025 నమోదు చేశారు. ఇందులో ఏ 1గా మన్నె క్రిశాంక్, ఏ 2 గా కేటీఆర్, ఏ 3గా కొణతం దిలీప్ కుమార్లతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఉగ్గిడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నెంబర్ 86/2025 ను నమోదు చేశారు. ఇందులో ఏ1 గా కొణతం దిలీప్ కుమార్ , ఏ2గా మన్నే క్రిశాంక్, ఏ 3గా కేటీఆర్, ఏ4 గా తెలుగు స్క్రైబ్ ఎండీ, ఏ5 గా మిర్రర్ టీవీ యూట్యూబ్ ఛానెల్ ఎండీతో పాటు మరికొందరిపైనా రెండు కేసుల్లోనూ 353(1)(c), 353(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు నకిరేకల్ పోలీసులు తెలిపారు.
………………………………………….