* 430 సీసీ కెమెరాల నిఘా
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలో ఐపీఎల్ (IPL 2026) క్రికెట్ ఫీవర్ మొదలైంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకు జరగనున్న మ్యాచ్ల కోసం పోలీసులు సర్వం సిద్ధం చేశారు. మ్యాచ్లు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఉప్పల్ డీసీపీ సురేష్ వెల్లడించారు.
* మూడంచెల భద్రత – కీలక విభాగాల మోహరింపు…
స్టేడియం లోపల, వెలుపల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ భద్రతా విధుల్లో కింది విభాగాలు పాల్గొంటున్నాయి:
లా అండ్ ఆర్డర్ (Law & Order)
*ట్రాఫిక్ విభాగం
*సెక్యూరిటీ వింగ్
*ఏఆర్ (Armed Reserve)
*మౌంటెడ్ పోలీస్ (Mounted Police)
430 సీసీ కెమెరాలతో డేగకన్ను
భద్రతను మరింత పటిష్టం చేసేందుకు స్టేడియం పరిసరాల్లో మొత్తం 430 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రతి కదలికను కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి నిరంతరం పర్యవేక్షించనున్నారు. లోపలికి వచ్చే ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారు.
మహిళల రక్షణ కోసం ‘షీ టీమ్స్’
మహిళా ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, వేధింపులకు తావులేకుండా ఉండేందుకు సివిల్ డ్రస్సుల్లో షీ టీమ్స్ (SHE Teams) బృందాలను రంగంలోకి దింపారు. వీరు గ్యాలరీల్లో నిరంతరం నిఘా ఉంచుతారు.
* అత్యవసర సేవలు సిద్ధం…
ఏదైనా ప్రమాదం లేదా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తక్షణ సాయం అందించేలా స్టేడియం వద్ద:
5 అంబులెన్సులు (వైద్య సేవల కోసం)
4 ఫైర్ ఇంజన్లు (అగ్ని ప్రమాదాల నివారణకు) సిద్ధంగా ఉంచారు.
* ప్రేక్షకులకు సూచనలు:
స్టేడియం వద్దకు కేవలం వ్యాలిడ్ టికెట్ ఉన్నవారు మాత్రమే రావాలని, అనవసరంగా గుమిగూడి రద్దీని పెంచవద్దని పోలీసులు కోరారు. ల్యాప్టాప్లు, బ్యాగులు, నీళ్ల బాటిళ్లు మరియు ఇతర నిషేధిత వస్తువులను స్టేడియంలోకి అనుమతించరు.
ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రేక్షకులు సాధ్యమైనంత వరకు మెట్రో లేదా ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మ్యాచ్లను ఎంజాయ్ చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీసీపీ సురేష్ స్పష్టం చేశారు.
