
* హైదరాబాద్ అశాంతితో…
* తెలంగాణ అభివృద్ధికి విఘాతం
(ప్రత్యేక ప్రతినిధి)
అకేరు న్యూస్ ,హైదరాబాద్ : ‘‘తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేట్ భారీగా పెరిగింది. 2023 క్రైమ్ రేటు వార్షిక నివేదికతో పోల్చితే 2024 వార్షిక నివేదికలో ఏకంగా 41శాతం నేరాలు పెరిగాయి.’’
ఈ ప్రకటన చేసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాదు. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం విడుదల చేసిన 2024 క్రైమ్ రేట్ వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. 2022 వార్షిక సంవత్సరంతో పోల్చితే 2023వ సంవత్సరంలో క్రైమ్ రేట్ కేవలం 2 శాతం మాత్రమే పెరగగా, 2024లో మాత్రం ఒక్కసారిగా 41 శాతం పెరగడం గమనార్హం. 2023లో 25,488 కేసులు నమోదు కాగా, 2024లో 35,944 కేసులు హైదరాబాద్ లో నమోదైనట్టు పోలీసు శాఖ తెలిపింది. ఈ నివేదిక రాష్ట్ర రాజధానిలో నివాసం ఉండే ప్రజలతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గదామంగా పేరొందిన హైదరాబాద్ నగరానికి ఓ మాయని మచ్చ. అంతేకాదు తెలంగాణ అభివృద్ధికి విఘాతం.
సాధారణంగా ఏదైన రాష్ట్రంలో, దేశంలో బహులజాతి సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ప్రభుత్వ సానుకూలతతో పాటు శాంతి భద్రతల అంశాలు అత్యంత కీలకంగా మారుతాయి. ప్రతి అంతర్జాతీయ సంస్థకు పెట్టుబడులు ఆదాయం ఎంత ముఖ్యమో పౌరుల, ఉద్యోగుల భద్రతత కూడా అంతే ముఖ్యం. ఈ విషయంను ముందుగానే గ్రహించిన మాజీ సీఎం కేసీఆర్ ఆది నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక ప్రగతి, అభివృద్ధి, పేదరిక నిర్మూలనతో పాటు రాష్ట్ర పౌరుల రక్షణ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రధానంగా దృష్టి సారించారు. రాష్ట్ర ప్రగతికి సానుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు ప్రజల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడితే, రాష్ట్ర ప్రగతి, ప్రజల అభివృద్ధి, పెట్టుబడుల కల్పన సాధ్యం కాదని విశ్వసించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి శాంతి భద్రతలు ఉండాలని సంకల్పించి ఆ దిశగానే పోలీసు శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా తెలంగాణలో క్రైం రేటు గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా హత్యలు, దోపిడీలు, లైంగికదాడులు, కిరాయిహత్యలు తదితర నేరాలు తెలంగాణలో గణనీయంగా తగ్గాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత కలహాలకు, ఉగ్రదాడులకు, దోపిడిదారులకు నిలయమైన హైదరాబాద్ నగరం గంగ %-% జమునా సమ్మిళిత సంస్కృతికి నిలయంగా మారింది. అంతేకాదు కాస్మోపాలిటన్, మెట్రో పాలిటన్ నుంచి విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు పడిన మాట వాస్తవం. అలాగే తెలంగాణలో పారిశ్రామిక, వ్యాపార, సేవా రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ, బహుళ జాతి సంస్థలు క్యూ కట్టాయి. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండంతో పాటు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణం ఉండటం, మౌలికసదుపాయాలు, పటిష్టమైన శాంతి, భద్రతల దృష్ట్యా బహులజాతి సంస్థలు తెలంగాణలో దీర్ఘకాలిక పెట్టుబడులను పెట్టేందుకు అత్యంత ఆసక్తి కనబర్చారు. గతంలో మెర్సర్ అనే ఓ అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ నగరాన్ని ‘సురక్షిత నగరం’గా పేర్కొంది. అంతేకాదు దేశంలో ఐ.సి.జె.ఎస్. వ్యవస్థతో సి.సి.టి.ఎన్.ఎస్. వ్యవస్థను ఇంటిగ్రేట్ చేసిన రాష్ట్రాలలో తొలి రాష్ట్రం తెలంగాణ నిలిచింది. ఈ ఫలితాల వెనుక సీఎం కేసీఆర్ దార్శనికత, తెలంగాణ పోలీసు అధికారుల కృషి ఇమిడి ఉంది. గతంలో పోలీసులు అంటేనే ఒకరకమైన భయం కారణంగా సామాన్యులు పోలీసు స్టేషన్కు వెళ్లేందుకు ఇబ్బందిపడేవారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను అమలు చేశారు. ముఖ్యంగా నేరాల అదుపులో ఖచ్చితత్వం, ప్రజల పట్ల సున్నితంగా ఉండాలని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నేరం జరిగిన క్షణాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకునేందుకు మొబైల్ పోలీస్, 24/7 అలర్ట్గా ఉండటం, జవాబుదారీతనం, విశ్వసనీయతపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వలన రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ సంతృప్తికర స్థాయిలో ఉన్నాయి. ప్రజల రక్షణ, శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రభుత్వం కమ్యూనిటీ పోలీసింగ్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వలన గడచిన తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో ఎక్కడ కూడా తీవ్రమైన శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాలేదు.
ప్రభుత్వం విస్తృతంగా సీసీ కెమరాలను ఏర్పాటు చేయడం వలన యావత్తు తెలంగాణ నిఘానీడలోకి వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతి ఇల్లు నిఘానీడలోకి వచ్చింది. దీంతో నేరానికి పాల్పడితే కటకటాలు తప్పవని నేరస్తులు భావించే పరిస్థితి వచ్చింది. టీఎస్ కాప్, హాక్ ఐ, సైబర్ క్రైం డిటెక్షన్ టూల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక అప్లికేషన్లను వినియోగిస్తూ నేరస్తులను పట్టుకోవడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందించడంలో తెలంగాణ పోలీసులు సఫలీకృతమయ్యారు. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం చాలా జిల్లా కేంద్రాలలో /కమీషనరేట్ల పరిధిలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే సున్నితమైన ప్రాంతాలు, నేరాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు, ఆసుపత్రులు, స్కూళ్ళు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు,, చారిత్రక ప్రాధాన్యత ఉన్న కట్టడాలు, మత పరమైన ప్రార్థనా ప్రదేశాలు వంటి కీలక ప్రాంతాలన్నింటినీ జియో ట్యాగింగ్ చేశారు. జి.ఐ.ఎస్. మ్యాప్ ప్లాట్ ఫారం ఆధారంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోని మొబైల్ యాప్ ‘టి.ఎస్. కాప్’ ద్వారా జియోట్యాగింగ్ చేసిన ప్రాంతాలపై నిరంతర నిఘా, పర్యవేక్షణ జరుగుతుండటంతో సున్నితమైన ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో నేర నియంత్రణపై పోలీసులకు పట్టు పెరిగింది. అంతేకాదు తెలంగాణ ప్రజా భద్రత (ప్రమాణాలు) అమలు చట్టం కూడా నేర నియంత్రణలో పౌరులు, కమ్యూనిటీకి భాగస్వామ్యానికి ప్రభుత్వం నాంది పలికింది. మత పరమైన శాంతి భద్రతలు కూడా పూర్తిగా అదుపులో ఉండటంతో బోనాలు, గణేష్ ఉత్సవాలు, బక్రీదు, మొహర్రం, బతుకమ్మపండగ, రంజాన్ తో పాటు జాతీయ పండుగలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గ్యాంబ్లింగ్ సెంటర్లు, పేకాట క్లబ్బులను నిషేదించారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో రాత్రింబవళ్లు తెరిచే ఉన్న గ్యాంబ్లింగ్ సెంటర్లు, పేకాట క్లబ్బులు శాశ్వతంగా మూతపడ్డాయి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ప్రత్యేక బృందాలతో పాటు మామూలుగా శాంతి భద్రతలు నిర్వహించే పోలీసులు సమన్వయంతో పని చేస్తూ గ్యాంబ్లింగ్ సెంటర్లను, పేకాట క్లబ్బులను కట్టడి చేశారు. మహిళలు, పిల్లల హక్కుల సంరక్షణ, భద్రతపై ప్రధాన దృష్టి సారించిన ప్రభుత్వం వారి రక్షణ కోసం ‘షీ’ టీమ్స్ను ఏర్పాటు చేసింది. ఈవ్ టీజింగ్, పబ్లిక్ ప్రదేశాలలో మహిళలను వేధించడం వంటి నేరాలను నియంత్రించడంలో నగరంలోని అన్ని ప్రాంతాలలోనూ ‘షి’ బృందాలు చురుకుగా పని చేస్తున్నాయి. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అవసరమైన న్యాయ సలహాలు, వ్యక్తిగత కౌన్సెలింగ్, అవగాహన కల్పిస్తున్నారు. అలాగే మైనర్ పిల్లలపై జరిగే నేరాల విచారణకు ‘పోస్కో’ చట్టం పరిధిలో వినూత్నమైన ‘బాలల స్నేహపూర్వక కోర్టులు’ ఏర్పాటు చేస్తున్నారు.
అయితే గత కేసీఆర్ ప్రభుత్వం పోలీసు శాఖలో చేపట్టిన సంస్కరణలను ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. శాంతి భద్రతల విషయంలో రేవంత్ ప్రభుత్వం రాజీ పడటం లేదు. కానీ రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో నేరాలు భారీగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే 41శాతం పెరగడం ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రజలను, ఇన్వెస్టర్లను ఆందోళన కలిగించే అంశం. అయితే చాలా మంది రాష్ట్రంలో హోంమంత్రి లేని కారణంగానే శాంతి భద్రతలు అదుపు తప్పాయని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. కానీ రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నప్పటికీ శాంతి భద్రతలు మాత్రం సీఎం చేతుల్లోనే ఉండటం గత 25 యేండ్లుగా ఉన్న ఆనవాయితే. కొత్తగా హోం మంత్రిని నియమించినా ప్రస్తుతం కూడా శాంతి భద్రతలు సీఎం చేతిలోనే ఉంటాయి. అయితే ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖతో పాటు శాంతి భద్రతలను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవే…స్తున్నారు. అయినా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగడం, క్రైమ్ రేటు అమాంతం పెరగడానికి గల కారణాలపై ప్రభుత్వం అంతర్గత విచారణ నిర్వహించుకోవల్సిన అవసరం ఉంది. లేదంటే తెలంగాణలో పెట్టుబడులపై సందిగ్దత నెలకొంటుంది. ముఖ్యంగా శాంతి భద్రతలు అదుపులో లేని ప్రాంతాల్లో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అనాసక్తి కనబరుస్తాయి. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, అనాలోచిత ప్రకటనలు, మెట్రో అలైన్మెంట్ మార్పు వంటి అంశాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడంతో పాటు రియల్ రారాజుగా ఎదిగిన హైదరాబాద్ రియాల్టీ రంగం కూదేలైంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు రియల్ రంగంపై ఆదారపడిన నిర్మాణ రంగంపై, సిమెంట్, స్టీల్ పరిశ్రమలపై ఆదారపడిన కార్మికుల జీవిక అగమ్యగోచరంగా మారింది. తాజాగా శాంతి భద్రతలకు కూడా విఘాతం వాటిల్లితే హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ మరింత దిగజారడం ఖాయం. ఈ విషయాన్ని గమనికలోకి తీసుకొని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సుసంపన్నమైన, సురక్షితమైన, సుభిక్షమైన రాష్ట్రంగా నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. లేదంటే రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గోరమైన అప్రతిష్టను మూటగట్టుకోవల్సి వస్తుంది.
* బూడిద సుధాకర్
సీనియర్ జర్నలిస్టు
7680992342
………………………………………………….