![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/images-9.jpg)
* చంద్ర మండలానికి వెళ్లినా భూమిపైన ఎలా ఉండాలో మాత్రం తెలుసుకోలేకపోతున్నాం
* కాలుష్యకారక వాహనాలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలిస్తున్నాం
* సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, చంద్రమండలానికి వెళ్తున్నాం.. కానీ భూమిపైన ఎలా ఉండాలో మాత్రం తెలుసుకోలేకపోతున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించగా.. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కాలుష్యకారక వాహనాలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలిస్తున్నామని.. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేయించామన్నారు. మహిళా సంఘాలతో సోలార్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని, హైటెక్ సిటీ పక్కనే మహిళా సంఘాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు మూడున్నర ఎకరాల స్థలంలో స్టాల్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మొటిక్ ఛార్జీలను పెంచామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మహిళాభివృద్ధి ధ్యేయంగా అడుగులు..
రాష్ట్రంలో మహిళాభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామీణ మహిళల సాధికారత కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. తెలంగాణలో ఆటో మొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని, మచిలీపట్నం పోర్ట్ను అనుసంధానం చేస్తు రోడ్లు రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రీజనల్ రింగ్ రైల్వే లైన్ మంజూరు చేయాలని ప్రధాని మోదీని కోరామని చెప్పారు. చైనా తరహాలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య రేడియల్ రోడ్లు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రతేడాది లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల ఉత్తీర్ణత
తెలంగాణలో ప్రతి యేడాది లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తున్నారన్నారు. ఎక్కువ మంది విద్యార్థుల్లో స్కిల్ ఉండటం లేదని, టాటా గ్రూప్తో కలిసి 2400 కోట్లతో రాష్ట్రంలోని ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామన్నారు. నైపుణ్యాల పెంపు కోసం ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఐఎస్ బీ తరహాలో స్కిల్ యూనివర్సిటీ కోసం ఆనంద్ మహీంద్రా చైర్మన్గా బోర్డు ఏర్పాటు చేశామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ కార్పస్ ఫండ్ కోసం సీఐఐ ప్రతినిధులు మద్దతు ఇవ్వాలని, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సీఐఐ ప్రతినిధులు ఎప్పుడైనా వచ్చి తనను కలవచ్చు.. తమ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా హైదరాబాద్లో ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రపంచంలో హైదరాబాద్ను చైనాకు ప్లస్ సిటీగా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్ , దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందని వివరించారు. భారతదేశంలోనే గొప్ప నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం.. ఇందులో సేవారంగం మాత్రమే ఉంటుందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించామని ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నామని అన్నారు. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా తెలంగాణలో అమ్ముడవుతున్నాయని ముఖ్యమంత్రి వివరించారు.
…………………………………………