
* రాష్ట్ర, ఐటి, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఆకేరున్యూస్, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్, మండలం కొండంపల్లి గ్రామంలో రాష్ట్ర, ఐటి, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ( SRIDHAR BABU ) జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(RAHUL SHARMA) తో కలిసి గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సన్న రకం ధాన్యం క్రింద ఏ రకం ధాన్యాన్ని పరిగణిస్తున్నామనే అంశంపై రైతులకు స్పష్టంగా తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దొడ్డు రకం, సన్న రకం తేడాను స్పష్టంగా తెలియజేసేలా కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జిల్లాలో ఉన్న మిల్లుల నుంచి బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తామని అండర్ టేకింగ్ ఆఫిడవిట్ తీసుకొని ధాన్యం కేటాయింపులు చేయాలని తెలిపారు.
రైస్ మిల్లుర్లు తాలు పేరుతో రైతులకు కోతలు పెట్టవద్దని పేర్కొన్నారు. సన్నరకం ధాన్యంపై ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ అర్హులైన ప్రతి రైతుకు అందాలని అన్నారు. జిల్లా సరిహద్దులో పటిష్ఠ పర్యవేక్షణ చేయాలని ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం మన జిల్లాకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కొనుగోలు ప్రక్రియ సజావుగా, సక్రమంగా చేపట్టాలని, రైతుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు. విక్రయాల్లో తీసుకోవాల్సిన నాణ్యత ప్రమాణాలపై రైతులకు వివరించాలని, రైతుల కోసమే మనం ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దని అధికారులకు సూచించారు. రైతులు విక్రయాలకు వచ్చేతప్పుడు వ్యవసాయ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాసు బుక్ జిరాక్స్ కాపీలను వెంట తెచ్చు కోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించామని తెలిపారు. సమగ్ర కార్యచరణ అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో ఖమ్మం జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంటే ప్రస్తుతం 323 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన వేయింగ్, తేమ పరిశీలించే పరికరాలు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. మన జిల్లా సరిహద్దులో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులు 24 గంటలపాటు తనిఖీ చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వ్యవసాయ అధికారులు వారి పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నాణ్యత, దిగుబడి వివరాలను ధ్రువీకరణ చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మేర టార్పాలిన్లు, గన్ని సంచులు అందుబాటులో పెట్టామని అన్నారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యం తరలించేలా అవసరమైన వాహనాలు సన్నద్ధం చేశామని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. అత్యవసర సమయాల్లో దాన్యం నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిల్లర్లతో సమావేశం నిర్వహించి బియ్యం అప్పగించిన వెంటనే బ్యాంకు గ్యారంటీలు విడుదల చేస్తామని సమాచారం అందించామని, బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు జిల్లాలో మిల్లర్లు అంగీకరించారని తెలిపారు. ధాన్యం రవాణాకు కేటాయించిన వాహనాలు ఇతర పనులకు వినియోగించకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఎస్వో శ్రీనాథ్, డిఎం కనక శేఖర్, డీసీవో వాలియా నాయక్, విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
………………………………….