
* వికారాబాద్ రైతులకు కేటీఆర్ హామీ
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో ప్రభుత్వం అలైన్మెంట్ మార్పు వల్ల ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ రైతులను ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను వికారాబాద్ రైతులు కలిశారు. ఈ సందర్భంగా రైతులతో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం భూసేకరణ చేసేటప్పుడు ఎందుకు తీసుకుంటున్నారో చాలా స్పష్టంగా చెప్పాలని, ఎంత తీసుకుంటున్నారో కూడా స్పష్టంగా చర్చించి చెప్పాలని అన్నారు.చట్టప్రకారం వ్యవహరించాలని, ప్రభుత్వం ఇష్టానుసారంగా భూములు లాక్కుంటామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములను వదిలి ఇతర ప్రైవేట్ వ్యక్తుల భూములను ఇబ్బంది పెట్టేలా భూసేకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.గతంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ అంశంలో ఇదే విధంగా సొంత అజెండాలతో ముందుకు వెళ్లిందని, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో కూడా…. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒరిజినల్ అలైన్మెంట్ కాకుండా సొంత డబ్బులతో కడుతున్నామని చెప్పి తమవారి భూములను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు.అందుకోసం వేలాదిమంది రైతుల జీవితాలను దెబ్బతీస్తోందని కేటీఆర్ విమర్శించారు.వికారాబాద్లో అలైన్మెంట్ మార్పు వల్ల భూములు కోల్పోతున్న ప్రతి ఒక్కరికీ పార్టీ తరఫున అండగా ఉంటామని, అవసరమైతే వారి తరఫున న్యాయ పోరాటం కూడా చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.వికారాబాద్ పరిధిలో భూములు కోల్పోతున్న ప్రజలు, గ్రామస్తులు అందరినీ కలుపుకొని ముందుకు పోతామని తెలిపారు.రింగ్ రోడ్డును సాధ్యమైనంతవరకు ప్రభుత్వ భూముల మీదుగా తీసుకువెళ్లాలని, పేద ప్రజల భూములకు నష్టం జరగకుండా చూడాలని అన్నారు.అవసరమైతే స్థానిక శాసనసభ్యులతో కలిసి స్పీకర్ దగ్గర కూడా మాట్లాడతానని తెలిపారు.
………………………………………………..