
* గుల్జార్ హౌజ్ ఘటనపై సమగ్ర విచారణ
* ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ
* కమిటీలో గ్రేటర్ అధికారులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాతబస్తీ లోని గుల్జార్ హౌజ్(GULJARHOUSE)లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. 17 మంది మృతి చెందిన ఘటనపై ఆరుగురు సభ్యుల కమిటీ ఆరా తీయనుంది. ప్రమాద కారణాలు, సహాయ చర్యలపై ప్రభుత్వం నివేదిక కోరింది. భవిష్యత్తులో నివారణ చర్యలపైనా కమిటీ సూచనలు చేయనుంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (PONNAM PRABHAKAR) మంగళవారం ఈ కమిటీ వివరాలను వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యల్లో వివిధ శాఖల పనితీరుపై ఈ కమిటీ నిశితంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. అంతేకాకుండా, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలను కూడా సూచించాలని కమిటీని కోరారు. ఈ కమిటీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఎ.వి. రంగనాథ్, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సభ్యులుగా ఉన్నారు.
……………………………………..