
* తొక్కిసలాటలో అమాయకులు బలి కావాల్సిందేనా .. ?
అకేరు న్యూస్ ,ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్.
జరుగుతున్న కార్యక్రమం ఎంత కీలకమైంది? అలాంటి కార్యక్రమాలకు గతంలో ఎంత మంది జనం వచ్చారు? ఇప్పుడు ఎంత మంది వచ్చే అవకాశం ఉంది? బందోబస్తు ఎలా ఏర్పాటు చేయాలి? ఇవి ముందుగా ఆలోచించాల్సిన అంశాలు.
ఇక్కడ ఎంత మంది జనం ఉన్నారు? ఎన్ని కౌంటర్లు ఉన్నాయి.. ఎన్ని క్యూలు ఉన్నాయి.. క్యూలు క్కిక్కిరిసి ఉన్నాయా? జనం ఎంత మంది వేచి ఉన్నారు? అసహనానికి, ఆందోళనకు లోనై ఉన్నవారిని సముదాయించడం ఎలా? బందోబస్తులో ఎంత మంది సిబ్బంది ఉన్నారు.. సరిపోతారా లేదా? అదనపు సిబ్బంది అవసరమా? ఇవీ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించాల్సిన అంశాలు.
ముందస్తు అంచనా, అప్పటికి అనువుగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తొక్కిసలాట ఘటనలను నివారించవచ్చు. ఇలాంటి ఘటనలు కొత్తేమీకాదు. దేశంలోనే కాదు.. తెలుగురాష్ట్రాల్లో మూడేళ్లలో 18 మంది తొక్కిసలాట ఘటనల్లో మృతి చెందారు.
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా ఆ స్థాయిలో అక్కడ భద్రత కల్పించలేదనేది భక్తులు, ప్రత్యక్షసాక్షుల కథనం ద్వారా తెలుస్తోంది. ఇబ్బందులు పడుతున్నాం.. సహాయం చేయండని పలువురు భక్తులు అక్కడి సిబ్బందిని కోరినా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ డీఎస్పీ అత్యుత్యాహమే ఈ ఘటనకు కారణమని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంబులెన్స్ సకాలంలో వచ్చి ఉంటే కొంతైనా ప్రాణాపాయం తప్పేదని మరో వాదన వినిపిస్తోంది. అంబులెన్స్ వాహనాన్ని డ్రైవర్ టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి వెళ్లిపోయాడు. డ్రైవర్ 20 నిమిషాల పాటు అందుబాటులోకి రాలేదు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని ఓ నివేదికను ముఖ్యమంత్రికి అందించారు. చనిపోయిన తర్వాత పోస్టుమార్టం అవసరమే కానీ, అందుకు కారణాలు తెలిసి కూడా అధికారులు మేల్కొనడం లేదని గత ఘటనలను బట్టి తెలుస్తోంది.
ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్లో జరిగిన సంథ్య థియేటర్ ఘటనను పరిశీలిస్తే.. అందులో కూడా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. హీరో రాకకు పోలీసుల అనుమతి లేదని చెబుతున్నారు. వస్తే అక్కడ తొక్కిసలాటకు అవకాశం ఉందని తెలుసు. సాధారణంగా ఏదైనా రాజకీయ ఆందోళనలకు పిలుపునిచ్చినప్పుడు ముందస్తుగా ఊళ్లల్లోనే, ఇంటి వద్దే నేతలను నిలువరిస్తున్నారు. జనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఇటువంటి చర్యలు చేపట్టినట్లు చెబుతారు. అయితే, పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న జన సమ్మర్థం పోలీసులకు ముందే కనిపించే ఉంటుంది. అయినా ఆ స్థాయిలో బందోబస్తు లేదు. సినిమా చూసేందుకు హీరో వస్తున్నాడని తెలిసి ఆయనను ఇంటి వద్దే ఆపి ఉంటే.. సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణం కోల్పోయేది కాదు. ఓ బిడ్డ 35 రోజులకు పైగా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడే పరిస్థితి వచ్చేది కాదు. రద్దీకి అనుగుణంగా తగిన భద్రత, ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యమే ఇందుకు కారమని స్పష్టమవుతోంది.
ఇక తిరుపతి ఘటనను పరిశీలిస్తే…
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతిలోని టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఉదయం నుంచీ వేచి ఉన్నారు. గేటు తీసిన క్రమంలో ఒక్కసారిగా ఒకరినొకరు తోసుకున్నారు. టికెట్లు అయిపోతాయేమోనని, వైకుంఠ ద్వార దర్శనం దక్కదేమోనని ఆందోళన చెందారు. వెనుక నుంచి ఆత్రుత పడే వారికి ముందు వారి అవస్థ తెలియదు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అయితే .., గేటు తీయకముందే అక్కడి పరిస్థితి, జనం ఎలా ఉన్నారనేది అధికారులకు తెలుసు. ఎప్పుడూ ఉండే రద్దీగానే దాన్ని చూశారు. అప్పటికప్పుడు అదనపు భద్రత ఏర్పాటు చేయడం, భక్తులకు ముందస్తు సూచనలు చేసే చర్యలు చేపట్టలేదు. క్యూల్లోకి పంపే ముందు బైరాగిపట్టెడలోని ఓ కొత్త ప్రదేశంలో భక్తులను ఉంచారు. అక్కడ ఎలాంటి నిబంధనలూ పెట్టలేదు. రెండు వేల మంది పట్టేచోట అంతకుమించిన జనాన్ని ఉంచారు. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు గేటు తీసేముందే తగిన జాగ్రత్తలు చేపట్టలేదు. ఫలితంగా ప్రాణనష్టం జరిగింది.
సంథ్య థియేటర్, తిరుపతి ఘటనలే కాదు.. గతంలోనూ ఈ తరహా తొక్కిసలాటలు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. 2022 డిసెంబరు 28 న ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుజిల్లా కందుకూరులో ఒక రాజకీయ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. కొందరు కాలవలో పడడంతో ఎనిమిది మంది మృతి చెందారు. 2023 జనవరి 1 న అదే రాష్ట్రంలోని గుంటూరులో జరిగిన ఒక రాజకీయ సభలో చీరలు, పలు కానుకలు పంపిణీ చేశారు. ఆ సందర్భంలో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. అయినప్పటికీ ప్రభుత్వాలు, అధికారులు గతం నుంచి గుణపాఠాలు నేర్వడం లేదు.
తొక్కిసలాట ఘటనలు ఏవీ ప్రకృతి వైపరీత్యాలు కాదు. అకస్మాత్తుగా జరిగే ఘటనలు కావు. పదులు, వందల సంఖ్య నుంచి వేలాదిగా పెరుగుతూ ఉంటారు. పెరుగుతున్న జనాన్నిబట్టి తగిన చర్యలు తీసుకుంటే ముప్పును తప్పించే అవకాశాలు ఉంటాయి. ఊహించనిదాని కంటే ఎక్కువ మంది జనం వవ్చినా భద్రత పెంచకుండా, ఉన్నవారితోనే సరిపెట్టడంతోనే ముప్పు వాటిల్లుతోంది. ప్రజలు గుమికూడే సందర్భాలలో శిక్షణ తీసుకున్న అధికారులను తప్పక వినియోగించుకోవాలి. జనసందోహాన్ని నిర్ణీత సమయంలో, స్థల విస్తీర్ణాన్ని బట్టి గుంపులుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో పంపించాలి. తగిన బారీకేడ్లు ఏర్పాటు చేయాలి. ప్రజలు అసహనానికి లోనవకుండా చూసుకోవాలి. చిన్నపాటి జాగ్రత్తలతో పెనుప్రమాదాన్ని నివారించవచ్చు.
………………………………………………………………