
* వరంగల్ ఎంపీ కడియం కావ్య
* గోవాలో ఫ్రిడ్రిక్ ఎబర్ట్ స్టిఫ్టుంజ్ ఇండియా సెమినార్
ఆకేరు న్యూస్ డెస్క్: డిజిటల్సేవల వినియోగంలో మహిళలు వెనుకబడి ఉన్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. గోవా రాష్ట్రంలో ఫ్రిడ్రిక్ ఎబర్ట్ స్టిఫ్టుంజ్ ఇండియా సంస్థ ఆర్గనైజ్ చేసిన సెమినార్లో శనివారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య గారు పాల్గన్నారు. ఈ సందర్భంగా మహిళలు డిజిటల్ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళల శక్తివృద్ధికి అవసరమైన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గారు మాట్లాడుతూ… చిన్న మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లో మహిళలు పురుషుల కంటే 8% తక్కువగా మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నారని, స్మార్ట్ ఫోన్ వినియోగంలో 13% తేడా ఉన్నట్లు వివరించారు. 405 మిలియన్ల మంది మహిళలు ఇంకా డిజిటల్ ప్రపంచానికి చేరుకోలేదని, దీని వల్ల మహిళల అభివృద్ధికి పెద్ద ఆటంకమవుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో 75% మహిళలు మాత్రమే మొబైల్ ఫోన్ కలిగి ఉండగా, స్మార్ట్ ఫోన్ వినియోగం కేవలం 35% మాత్రమే ఉందని వెల్లడించారు. ఈ డిజిటల్ గ్యాప్ వల్ల మహిళల ఆర్థిక స్వావలంబన, విద్య, ఆరోగ్య సేవలు పొందడంలో సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు.మహిళల పురాతన శక్తి ప్రతీకగా వరంగల్ ప్రాంతంలోని చారిత్రక ఘటనలను వివరించారు. కాకతీయ రాణీ రుద్రమదేవి నాయకత్వం, సమ్మక్క – సారలమ్మ పూజలు వంటి చారిత్రక సంఘటనలతో మహిళల శక్తిని వివరించారు.తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం, వడ్డిరహిత రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీలేని రుణాలను విడుదల, ఆరోగ్యసేవలకు 10 లక్షల వరకూ సౌకర్యం, 2,500 నెలకు ఆర్థిక సహాయం వంటి సమర్థమైన పథకాలు అమలు అవుతున్నట్లు వివరించారు.డిజిటల్ లో మహిళల అసమానతలు తగ్గించేందుకు తక్కువ ధరకే మొబైల్ డివైసులు అందించడం, డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాలు పెంపొందించడం అత్యవసరమని వరంగల్ ఎంపీ డా. కావ్య గారు అన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం గణనీయమైన కృషి చేస్తున్నదన్నారు. ఈ సదస్సులో మహిళ నాయకులు తమిళనాడు ఎంపీ ఆర్.సుధ , ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి తోబాటు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.
…………………………………………