
* తెలంగాణలో ఎనిమిది నెలల్లో రికార్డు స్థాయి ఆదాయం
* అసెంబ్లీలో ప్రకటించిన ఎక్సైజ్ శాఖ
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మద్యం విక్రయాలతో ప్రభుత్వ ఖజానాకు 8 నెలల్లో రూ.20,903.13 కోట్ల ఆదాయం సమకూరినట్లు అబ్కారీ శాఖ వెల్లడిరచింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబరు వరకు ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాలపై రెవెన్యూ రూపేణా రూ.10,285.58 కోట్లు, ఆధారిత పన్ను రూపంలో రూ.10,607.55 కోట్లు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అసెంబ్లీలో ప్రకటించింది. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు కేపీ వివేకానంద, హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్లు అడిగిన ప్రశ్నలకు అబ్కారీ శాఖ సమాధానం ఇచ్చింది. బెల్టు షాపులు ఎన్ని ఉన్నాయని సభ్యులు అడిగిన ప్రశ్నకు.. రాష్ట్రంలో బెల్ష్ షాపులకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అక్రమ మద్యం విక్రయాలను కట్టడి చేస్తున్నామని, ఎక్సైజ్ చట్టాల ప్రకారం ఎప్పటికప్పుడు అనధికారిక మద్యం విక్రయా లపై కేసులు నమోదు చేస్తున్నామని సభలో ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు నాటికి అనధికారిక విక్రయాలపై 6,915 కేసులు నమోదు చేశామని వివరించారు. ఈ కేసుల్లో 6,728 మందిని అరెస్టు చేయడంతో పాటు 74,425 లీటర్ల మద్యం 353 వాహనాలను జప్తు చేసినట్లు వెల్లడిరచారు. మద్యపాన దుష్ప్రభావాలు, మత్తు పదార్థాల దుర్వినియోగంపై తెలంగాణలో 735 అవగాహన సదస్సులు నిర్వహించారు.
………………………………………