
* సంధ్య థియేటర్కు షోకాజ్ నోటీసులిచ్చిన చిక్కడపల్లి పోలీసులు
* థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు
* 10 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేస్తామంటూ హెచ్చరిక..
ఆకేరున్యూస్, హైదరాబాద్: సంధ్య థియేటర్కు హైదరాబాద్ పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ.. నోటీసులు జారీ చేశారు. పుష్ప-2 ప్రిమియర్ షో సందర్భంగా తొక్కిసలాట ఘటనలో పోలీసులు 12 లోపాలు గుర్తించారు. దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసులు స్పష్టం చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో థియేటర్ యాజమాన్యం విఫలమైందన్నారు. థియేటర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణం పోయింది.. ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 4న రాత్రి 9:40 గంటల ప్రాంతంలో.. పుష్ప-2 ప్రిమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చారు. బన్నీని చూసేందుకు భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. అల్లు అర్జున్ను చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట అయితే.. క్రౌడ్ను మేనేజ్ చేయడానికి థియేటర్ యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణ ఉంది. ఈ కారణంగానే పరిస్థితి దిగజారిందనే వాదన ఉంది. థియేటర్లో భద్రతా సిబ్బంది లేకపోవడం, హీరో, నటీనటులు అనధికారికంగా రావడం వల్ల రద్దీ పెరిగింది.
దీంతో ఊపిరాడని పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే దిల్సుఖ్ నగర్ నివాసి మొగుడంపల్లి రేవతి (35), ఆమె 9 ఏళ్ల కుమారుడు తేజ్ కుప్పకూలిపోయారు. దీన్ని గమనించి ఎస్ఐ ఎల్. మౌనిక, పీసీ ఆంజనేయులుతో సహా విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది సీపీఆర్ చేశారు. ఆ వెంటనే దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు, రేవతి చనిపోయింది. ఆమె కొడుకును చికిత్స కోసం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 105, 118(1), 3(5) కింద కేసు నమోదు చేశారు. థియేటర్లో సురక్షితమైన వాతావరణాన్ని అందించడంలో విఫలమైనందుకు.. ఫారం-బి కింద మంజూరు అయిన సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ను ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలని.. సంధ్య థియేటర్ లైసెన్స్దారు రేణుకా దేవిని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. షోకాజ్ నోటీసుకు స్పందించడానికి థియేటర్ యాజమాన్యానికి 10 రోజుల గడువు ఇచ్చారు.
……………………………………………..