
* నేడు ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు చివరిసారి సమావేశం కాబోతోంది. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సతక్క , సబ్ కమిటీ వైస్ చైర్మన్ దామోదర రాజనర్సింహతో పాటు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ , ఇతర ముఖ్య అధికారులు పాల్గొనున్నారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదం తెలిపారు. దీంతో బిల్లు తిరిగి ప్రభుత్వానికి చేరడంతో ఇవాళ ఎస్సీ వర్గీకరణ జీవోను సబ్ కమిటీ విడుదల చేయనుంది. అనంతరం జీవో తొలి కాపీని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. కాగా, జీవో విడుదలతో ఎస్సీ ఉప కులాలకు 15 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉప కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్-1 కింద ఒక శాతం, మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉప కులాలకు గ్రూప్-2 కింద 9 శాతం, గణనీయంగా లబ్ధిపొందిన 26 ఉప కులాలను గ్రూప్-3 కింద 5 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది.
…………………………………………….