Jalasiri Groundwater Recharge Initiative
ఆకేరు న్యూస్, కమలాపూర్:
జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాలని తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు అన్నారు.సోమవారం కమలాపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో కమ్యూనిటీ ఇంకుడు గుంత నిర్మాణానికి సర్పంచ్ పబ్బు సతీష్, ఎంపీడీవో గుండె బాబు మార్కౌట్ ఇచ్చారు. విబిజి రాంజీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించి, నీటి మట్టాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో గుండె బాబు మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి గ్రామంలో నీరు వృథాగా పోకుండా ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలు, ఆసుపత్రుల ఆవరణలలో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఎండిపోయిన లేదా నీరు రాని ప్రభుత్వ, వ్యక్తిగత బోర్వెళ్ల వద్ద తప్పనిసరిగా రీఛార్జ్ స్ట్రక్చర్లు ఏర్పాటు చేయాలన్నారు. చిన్న, సన్నకారు రైతులు తమ పంట పొలాల్లో పంట కుంటలు (ఫార్మ్ పాండ్స్) నిర్మించుకోవడానికి ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వ భవనాల పైకప్పుల నీటి మళ్లింపునకు వాటర్ హార్వెస్టింగ్, ప్రతి గ్రామంలో పర్కోలేషన్ ట్యాంకులు, ప్రతి ఇంటికీ వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలనీ తెలిపారు.
అలాగే విబిజీ రాంజీ పథకంలో రైతుల పంట కాలువలు, ఎస్సారెస్పీ పూడికతీత, చెరువుల పునరుద్ధరణ, పశువుల పాకల నిర్మాణం వంటి 338 రకాల పనులు అందుబాటులో ఉన్నాయని, గ్రామాల్లో ఉపాధి హామీ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 60 రోజులకు పైగా పనిదినాలు పూర్తి చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చందు నాయక్, వైద్య బృందం, ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
