
– గణనీయంగా పెరుగుతున్న కార్ల సంఖ్య
– ఎంతకీ తగ్గని ట్రాఫిక్ సమస్య
– ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఎన్నొచ్చినా అంతే
– ప్రజారవాణా పెరగకుంటే ఇబ్బందులు తప్పవు
– ప్రైవేటు వాహనాలు పెరుగుతుంటే ట్రాఫిక్ తిప్పలే
– కిలోమీటరు ప్రయాణానికి అరగంట పైనే సమయం
మహా నగరంలో వాహనాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ప్రధాన రోడ్లే కాదు.. అంతర్గత రహదారుల్లో కూడా వాహనాలు బారులు దీరుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ సమస్య, పెరుగుతున్న కాలుష్యం నగరవాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రతిరోజూ కొత్తగా 1600 కార్లు రోడ్డెక్కుతున్నాయని రవాణ శాఖ గణాంకాలు చెబుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సమగ్ర మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కొత్తగా ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించారు. అండర్ పాస్లు అందుబాటులోకి తెచ్చారు. మెట్రోరైలు సేవలూ అందుతున్నాయి. అయినప్పటికీ ఏ రోడ్డుపై చూసినా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. రద్దీ సమయాల్లో ఇక చెప్పే పని అవసరం లేదు. కిలోమీటరు దూరానికి అరగంటకు పైగా సమయం పడుతోంది. ప్రధానంగా ఐటీ కారిడార్ కార్లతో కిక్కిరిసిపోతోంది. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలతో పాటు పలు కార్పొరేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్, ఫార్మా, కార్పొరేట్ ఆస్పత్రులు, మాల్స్, మల్టీఫ్లెక్సులు, స్టార్ హోటళ్ల కార్యకలాపాలు సైబరాబాద్ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. అత్యధిక మంది కార్లతో ఈ ప్రాంతానికి వస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
ఐటీ కేంద్రంలో మరిన్ని తిప్పలు
మహా నగరం ఐటీ కేంద్రంగా వర్దిల్లుతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ప్రతి రోజూ లక్షలాది మంది ఉద్యోగులు ఐటీ కారిడార్ వైపు రాకపోకలు సాగిస్తున్నారు. ఆస్థాయిలో ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేదు. మెట్రోరైలు సౌకర్యం ఉన్నా అది రాయదుర్గం వరకే పరిమితమైంది. ఐటీ కంపెనీలు మాత్రం మాదాపూర్, రాయదుర్గం నుంచి గచ్చిబౌలి, నానక్రాంగూడ, ఫైనాన్సియల్ డిస్ర్టిక్ మీదుగా కోకాపేట వరకు విస్తరించి ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు, మెట్రోరైలు, ఎంఎంటీఎస్ వంటి ప్రజా రవాణా సాధనాలు లేకపోవడంతో మెజారిటీ ఉద్యోగులు సొంత వాహనాల్లోనే కార్యాలయాలకు వచ్చి వెళ్తున్నారు. ఫలితంగా లక్షలాది వాహనాలు ఐటీ కారిడార్కు వస్తున్న నేపథ్యంలోనే ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. ప్రైవేటు వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో రోడ్లన్నీ వాహనాలతోనే నిండి ఉంటున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే ట్రాఫిక్ తిప్పలు పెరుగుతూనే ఉంటాయి.
స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మహానగర ట్రాఫిక్ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మాట్లాడారు. రోడ్లపై పెరుగుతున్న కార్లను, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పరిష్కారాలను ప్రస్తావించారు. “అసెంబ్లీలో ఒక ప్రశ్నకకు సమాధానంగా నగర రోడ్లపై రోజూ కొత్తగా 1600 కార్లు అదనంగా చేరుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు, స్నేహితులు, సహోద్యోగులు తాము పనిచేసే చోటుకు వేర్వేరు కార్లలోనే వెళ్లి వస్తుంటారు. ఇది రోడ్లపై ట్రాఫిక్ రద్దీని పెంచుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో కార్పూలింగ్ పట్ల అవగాహన పెంచి, ప్రతీ కారులో నలుగురు నుంచి అయిదుగురు వెళ్లేలా చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.” అని వివరించారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి త్వరితగతిన సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
………………………………………