
* ప్రజలు చూడొచ్చు.. చూడకపోవచ్చు.. విడుదల అడ్డుకోవడం సరికాదు
* సుప్రీం ఆదేశాలతో ఊరట
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన మూవీ థగ్ లైఫ్ (Thug Life Movie) కర్ణాటకలోనూ విడుదల కానుంది. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆ సినిమా లైన్ క్లియిర్ అయింది. ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమాను కుట్ర పూరితంగా కర్ణాటకలో విడుదల అడ్డుకున్నారని దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు(suprime court)లో నిర్మాత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈరోజు విచారణ జరిపారు. ఈ సినిమాను కర్ణాటకలోనూ విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అడ్డుకునేందుకు ఎవరికీ అధికారం లేదని పేర్కొంది. ప్రజలు సినిమాను చూడొచ్చు.. చూడకపోవచ్చు.. విడుదల అడ్డుకోవడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. గతంలో కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై చిత్ర యూనిట్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా, కమల్ క్షమాపణ చెబితే సమస్య పరిష్కారమవుతుందని కోర్టు సూచించింది. అయితే కమల్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో, ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
………………………………………….