
* పోలీసుల తీరు పై కమిషనర్ ఆగ్రహం
* నిబంధనలు ఉల్లఘించారని ఆరోపణ
* రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
* మెమో జారీ చేసిన కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
ఆకేరున్యూస్,వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పోలీసులపై కొరడా ఝులిపించారు. కొంత మంది పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కి పోలీసులు చేస్తున్న సేవ విమర్శలకు దారితీసింది. ప్రభుత్వపరంగా కొండా మురళి ఎలాంటి పదవిలో లేక పోయినా ఆయనకు భద్రత కల్పిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. జూన్ 13 తారీఖున కొండా మురళి ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఆయనకు పోలీసు అధికారులు ప్రొటోకాల్ కు విరుద్ధంగా భద్రత కల్పించారు. ఈ విషయం మీడియాలో హల్చల్ చేసింది. పోలీసు నిబంధనలు, పోలీసు ప్రొటొకాల్ ప్రకారం కొండా మురళికి ఎలాంటి ప్రత్యేక భద్రత కల్పించాల్సిన అవసరం లేదు.. ఎవరికి భద్రత కల్పించాలి ఎవరికీ భద్రత కల్పించకూడదు, ఎంతమేర భద్రత కల్పించాలనేది పోలీసుల ప్రొటాకాల్ సిస్టంలో ఉంటుంది. జూన్ 13న కొండా మురళి పాల్గొన్న కార్యక్రమంలో పోలీసులు ఆయనకు కల్పించిన భద్రతపై కమిషనర్ దృష్టికి రావడంతో ఆయన దీనిపై తీవ్రంగా స్పందించారు.నిబంధనల మేరకు వారిపై ఎందుకు చర్యతీసుకోరాదు అని వారిని ప్రశ్నించారు. ఆ కార్యక్రమంలో భద్రత ఎందుకు కల్పించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని మెమో జారీ చేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
……………………………………………