
* కాంగ్రెస్లో కల్లోల కలవరం!
* నేతల మధ్య కయ్యాలు..
* ఒకరు ఎడ్డం అంటే.. మరొకరు తెడ్డెం..
* మంత్రులు వర్సెస్ టీపీసీసీ చీఫ్
* మొదట్లో ఉన్నంత ఐక్యత ఇప్పుడు కనిపించడం లేదా?
స్పెషల్ స్టోరీ
ఆకేరు న్యూస్,హైదరాబాద్ :
“కేబినెట్ లో ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై ముందస్తుగా ప్రకటించడం ఏంటి? పైగా ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉందన్న విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది. మనం అంతరంగికంగా మాట్లాడుకునేవి వేదికలపై చెబితే ఎలా? సమష్టిగా నిర్ణయాలు తీసుకుందాం. ముందు ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేసిందో, ఏం చేయబోతుందో చెప్పడంపై దృష్టి పెట్టిండి..” అంటూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సున్నితంగా క్లాస్ పీకారు. మంత్రులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. మన మధ్య ఐక్యత లోపిస్తోంది అనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నట్లు సమాచారం.
“పార్టీతో సంప్రదించకుండా స్థానిక ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి ప్రకటన ఎలా చేస్తారు? మీ పరిధిలోని శాఖపై ఎలా మాట్లాడతారు? రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న అంశంపై ముందస్తు ప్రకటన సరికాదు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడేటప్పుడు మంత్రులు జాగ్రత్తలు వహించాలి”… అంటూ ఓ మంత్రిపై మంత్రి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగంగానే ఫైర్ అయ్యారు.
కల్లోలం..
స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్న వేళ.. అదే అంశానికి చెందిన ప్రకటనలపై కాంగ్రెస్ నేతల పొంతనలేని ప్రకటనలు, దానిపై విమర్శలు పార్టీలో కల్లోలం రేపుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సమష్టిగా, ఒకేతాటిపై కనిపించిన నేతల తీరు ఇప్పుడు విరుద్ధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్లో లుకలుకలు బహిర్గతం అవుతున్నాయి. “ఒకరు ఎడ్డం అంటే, మరొకరు తెడ్డెం” అంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్నపాటి వివాదాలు చినుకు చినుకు గాలి వానగా మారుతున్నాయి అనే చర్చ జరుగుతోంది. అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాల ను కూడా బహిర్గతం చేసుకుని నాయకులు రచ్చకెక్కుతున్నారు.
పార్టీకి నష్టమే..
తాజాగా ఓ మంత్రిపై పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేయడంతోపాటు.. ఆగ్రహంతో ఊగిపోయారు. ”జాగ్రత్తగా ఉండాలని చెప్పాలా?” అంటూ మహేష్ గౌడ్ నిప్పులు చెరిగారు. దీంతో తెలంగాణ అధికార పార్టీలో రగడలు రోడ్డున పడ్డట్టయ్యాయి. సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం కాకుండా, నాయకుల మార్పులు, చేర్పులు జరుగుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి నష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో స్థానిక సంస్థల ఎన్ని కలను హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే.. నిర్వహించాల్సి ఉంటుంది. అంతలోనే మంత్రి పొంగులేటి తొందరపడ్డారు. ఈ నెలాఖరులోనే స్థానిక ఎన్నికలు ఉంటాయని ఓ వేదికపై స్వయంగా ప్రకటించారు. దీనిపై పీసీసీ చీఫ్.. మహేష్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఏదైనా ఒక విషయంపై మాట్లాడేప్పుడు మంత్రులకు అవగాహన ఉండాలని హితవు పలికారు. ఎన్నికలకు సంబంధించి అధికారిక ప్రకటన రాక ముందే.. పార్టీలో రచ్చ బహిర్గతం కావడం కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తోంది.
…………………………………………………………