
* గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
*గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా వేడుకలు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన బహుమతి యోగా అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపున గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అపూర్వ కానుక అన్నారు. యోగా అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో అంతర్భాగం కావాలని గవర్నర్ అన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.
మోదీతోనే గుర్తింపు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ద్వారానే యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందన్నారు. 2014లో ఐక్యరాజ్యసమితిలో యోగా దినోత్సవం ప్రతిపాదన చేయడం ద్వారా యోగాను ప్రపంచవ్యాప్తం చేశారని, ఇది భారతీయ సంస్కృతికి గర్వకారణమని పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ కర్యక్రమంలో ఈ కార్యక్రమంలో దాదాపు 5,500 మంది విద్యార్థులు, యోగా శిక్షకులు, వైద్యులు, ప్రజలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు, సినీ నటులైన సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జ, మీనాక్షి చౌదరి, ఖుష్బూ వంటి ప్రముఖులు ఈ వేడుకలకు హాజరై యోగాసనాలు వేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ గా నిర్ణయించారు. ఈ థీమ్ యోగా ద్వారా ప్రకృతి, మానవ ఆరోగ్యం మధ్య సమతుల్యతను సాధించాలనే సందేశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోగా శిక్షకులు సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, వృక్షాసనం వంటి యోగాసనాలు చేశారు. ఈ ఆసనాలు ఒత్తిడిని తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు వివరించారు.
………………………………………….