* మెయిన్ పేపర్లు మళ్లీ రివాల్యుయేషన్ చేయాలి
* సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించండి
ఆకేరున్యూస్ హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తన తీర్పును వెలువరించింది. మెయిన్స్ పరీక్ష పేపర్లను మళ్లీ రివాల్యయేషన్ చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశించింది. ఒక వేళ రీ వాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని సూచించింది. రీవాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయని కొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే..ఈ పిటీషన్లపై జూలై 7న వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి. పరీక్షల్లో జెల్ పెన్నులు వాడటం, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండటం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తన తీర్పును వాయిదా వేస్తున్నట్టు జూలై 7న ప్రకటించారు. తాజాగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా రీవాల్యుయేషన్ జరిపించాలని టీజీపీఎస్సీని ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.
………………………………………………
