
నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి
*దేవుళ్ళ వద్ద రాజకీయం చేసిన నాయకులు ఎవరూ ఎదగలేదు
* రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు:వచ్చే ఏడాది జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని చెపడుతున్న పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, మేడారంలో జరుగునున్న పనులను పరిశీలించడానికి వారంలోగా ముఖ్యమంత్రి మేడారాన్ని పర్యటిస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం మేడారం గ్రామంలో జిల్లా కలెక్టర్ దివాకరటి.ఎస్., ఎస్పీ డాక్టర్ శబరిష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచంద్ర లతో కలసి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న విఐపి పార్కింగ్ రోడ్డు, పోలీస్ కంట్రోల్ రూమ్,
హరిత హోటల్ తదితర ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం మేడారంలోని ఐటీడీఏ సమావేశపు హాలులో అమ్మవార్ల పూజారులు, అన్ని శాఖల అధికారులతో శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ భక్తుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్ల రూపాయలను కేటాయించిందని, కేటాయించిన నిధులతో ఆయా శాఖల అధికారులు 100 రోజుల నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గద్దెల ప్రాంతంలో పూజారుల మనోభావాలు దెబ్బ తినకుండా వారి సూచనలు మేరకు నూతన హంగులతో శ్వాశతంగా నిలిచిపోయేలా పనులు చేయాలని, మేడారం గ్రామస్తులు పూజార్ల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పండుగనే కాకుండా మరో కుంభమేళా తరహలో జరగనున్న జాతరకు సామాన్య పౌరుని నుండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి ముఖ్యులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వివిఐపి లకు ఇబ్బందులు రాకుండా విమానాలు సైతం దిగే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈసారి చేపట్టనున్న పనులు శాశ్వతంగా ఉండే విధంగా పనులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. దేవుళ్ళు కలిగిన ప్రాంతంలో రాజకీయాలు చేసే ఏ రాజకీయ నాయకుడు ఎదగలేదని, రానున్న మహా జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. భక్తులకు అమ్మవార్లపై భక్తి విశ్వాసం పెంపొందించేలా జాతర ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ స్థపతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఈ శివ నాగిరెడ్డి, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గరావు, ఈ ఓ వీరస్వామి, ఆర్కేటెక్చర్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
…………………………………………….