* మంత్రి ధనసరి అనసూయ సీతక్క
* విశ్వవిద్యాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఆకేరు న్యూస్, ములుగు: ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉన్నత విద్యా అవకాశాలు అందుతాయని, విద్యా రంగంలో కొత్త అధ్యాయాన్ని సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ సృష్టిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
ఆదివారం జిల్లా కేంద్రం లో సెంట్రల్ ట్రైబల్ విశ్వవిద్యాలయం కోసం 24 కోట్ల నిధులతో 8.4 కిలోమీటర్ల సమ్మేళనం గోడ నిర్మాణ పనులను మంత్రి సీతక్క, మహబూబాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జి నాగేష్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ములుగు జిల్లాకు ప్రత్యేక గౌరవ లభిస్తుందని, గిరిజన విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఇది బలమైన వేదిక అవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ గిరిజన సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక వసతులను సమకూర్చుతామని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ఆధునిక లైబ్రరీలు, ల్యాబరేటరీలు, హాస్టల్స్, తరగతి గదులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
యూనివర్సిటీ ఏర్పాటు వల్ల విద్యా రగం అభివృద్ధి సాధిస్తుందని దిమా వ్యక్తం చేశారు.
ప్రజా ప్రభుత్వం గిరిజన సంక్షేమం, విద్యా అవకాశాలను ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, యూనివర్సిటీ ఏర్పాటు ములుగు జిల్లాకు గౌరవాన్ని కలిగించడమే కాక, విద్యా రంగంలో కొత్త మైలురాయిని సృష్టిస్తుందన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు కాబోతున్న సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీలో 80 శాతం స్థానిక విద్యార్థులకు ప్రవేశ అవకాశాలు కల్పించడం జరుగుతుందని యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా ప్రాంతీయ ప్రతిభను వెలికి తీయడానికి ముఖ్యమైన వేదికగా మారుతుందని తెలిపారు.
గిరిజన యూనివర్సిటీ తో అవకాశాలు అందుబాటులో వస్తాయని అన్నారు. యూనివర్సిటీ ద్వారా, యువత సుస్థిరమైన భవిష్యత్తుకు పునాది వేసినట్లు అవుతుందని సమాజానికి, జిల్లా అభివృద్ధికి, గిరిజన సంక్షేమానికి అభివృద్ధిలో మార్గదర్శిగా నిలుస్తుందని అన్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు జి నాగేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలోని గిరిజనుల విద్యాభివృద్ధి కి సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసేలా, ఆర్థిక అభివృద్ధిలో ఈ యూనివర్సిటీ ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. త్వరలోనే క్యాంపస్ నిర్మాణం విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని , కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో యూనివర్సిటీ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసినందుకు దేశ ప్రధాని, స్థానిక కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలియజేశారు. యూనివర్సిటీ వేగవంతంగా ఏర్పాటు చేసే విషయంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ తో కలిసి ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారామ్ నాయక్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………………
