* దేశానికే ఆదర్శం కేరళ
*మొంథా తుపాను బాధితులను ఆదుకోవాలి
* దెబ్బతిన్న దేవాదుల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి
* సిపిఐ సీనియర్ నాయకులు చాడ వెంకట రెడ్డి
ఆకేరు న్యూస్, హనుమకొండ : మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని..ప్రధానంగా బీమదేవరపల్లి మండలంలో తీవ్ర ప్రాణనష్టం, పశు సంపద, పంట నష్టం, ఆస్తి నష్టం, రోడ్లు దెబ్బతిన్నాయని సీపీఐ సీనియర్ నాయకులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. పూర్తిస్థాయిలో అంచనా వేసి బాధితులందరికి నష్ట పరిహారం చెల్లించాలని, వరద ప్రభావంతో దెబ్బతిన్న దేవాదుల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తపల్లి వరద ప్రభావంతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా కాకుండా రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పంట పొలాల్లో ఇసుక మేటలు తేలి రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందని, ప్రభుత్వం ఎకరాకు రూ. 10 వేల ప్రకటించిందని, ఆ పంట నష్టం ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, పశు సంపద నష్టపోయిన వారికి కూడా పరిహారం ఇవ్వాలని, ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, దెబ్బతిన్న దేవాదుల ప్రాజెక్టు తరిగతిన పూర్తి చేసి పంటలకు సాగు నీరు అందించాలన్నారు.
దేశానికి కేరళ ఆదర్శం:
పేదరిక నిర్మూలనలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఆదర్శమని చాడ వెంకట రెడ్డి అన్నారు. కమ్యూనిస్టు పాలన ఉంటే ఏమిటో కేరళ ప్రభుత్వం చూపించి, నిరూపించిందని, కేరళలో పేదరిక నిర్మూలనకు కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అమోగమని, విద్య, వైద్య రంగంలోనే కాకుండా సుపరిపాలనలో కేరళ దేశంలో ముందంజలో ఉందని చాడ తెలిపారు.
వందేళ్ల సిపిఐ జాతాను జయప్రదం చేయండి:
సిపిఐ వందేళ్ళ ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18, 19 తేదీల్లో హనుమకొండ జిల్లాలో జరిగే రాష్ట్ర బస్ జాతాను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి పిలుపునిచ్చారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి పోరాడిన చరిత్ర సిపిఐది అని, భారత దేశ గడ్డపై 100 సంవత్సరాల ప్రస్థానంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్మించినటువంటి పార్టీ సీపీఐ అని, అధికారం ఉన్న లేకున్నా పేద ప్రజల పక్షాన నిలబడి వారికోసం, వారి హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నదని కమ్యూనిస్టు పార్టీ అని ఆన్నారు. డిసెంబర్ 26న ఖమ్మం వేదికగా జరిగే సిపిఐ శత వసంతాల ఉత్సవ ముగింపు సభ ఓ చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని, సిపిఐ వందేళ్ళ ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈనెల 18, 19 తేదీల్లో హనుమకొండ జిల్లాలో రాష్ట్ర బస్ జాత జరుగునని తెలిపారు. ఈ బస్సు జాత నవంబర్ 18 తేదీన బీమదేవరపల్లి మండలంలోని మాణిక్య పూర్ గ్రామానికి చేరుకొని అక్కడి నుండి హనుమకొండ జిల్లాలో బస్సు జాత ప్రారంభం అయి 19వ తేదీన పరకాలలో ముగించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్లనుందని తెలిపారు. ఈ బస్సు జాతను పార్టీ, ప్రజా సంఘాల శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు అదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, కర్రే లక్ష్మణ్, ఎన్ ఎ స్టాలిన్, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొగల రామచంద్ర రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి అదరి రమేష్, నాయకులు చిలుక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
