* రైతుల త్యాగం మరువలేనిది
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు:సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర అభివృద్ధి కోసం తమ భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం మేడారం ఐటీడీఏ అతిథి గృహంలో రైతులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మేడారం శాశ్వత అభివృద్ధి కోసం ప్రభుత్వం కోరగానే స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులను తాము ఎప్పటికి గుర్తుంచుకుంటమన్నారు.
మేడారం జాతర కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయమైన పరిహారం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇంచర్ల ప్రాంతంలో, జాతీయ రహదారి వద్ద ఇండ్ల కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా మేడారం జాతర సందర్భంగా వారికి షాపుల కేటాయింపును కూడా చేపట్టి, అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.మేడారం భూసేకరణ పనులను పూర్తిగా పారదర్శకంగా, నమ్మకంగా పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఆర్డీఓ వెంకటేష్లను మంత్రి సీతక్క ఈ సందర్భంగా అభినందించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ ప్రక్రియ విజయవంతమైందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పి ఓ చిత్ర మిశ్ర, ఆర్డీఓ వెంకటేష్, భూములు కోల్పోయిన రైతులు, పూజారులు, ఆదివాసీ సంఘాలు, మేడారం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
…………………………………..

