ఆకేరు న్యూస్,కేసముద్రం: మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న భుక్యా బాలు నాయక్ నేరుగా స్మశాన వాటికకు వెళ్లి చనిపోయిన వారి సమాధుల వద్ద ఓట్లను అభ్యర్థిస్తూ నిరసన తెలిపారు.ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాల్సి ఉన్నప్పటికీ, అధికారులు నిర్లక్ష్యం వహించారని బాలు నాయక్ ఆరోపిస్తున్నారు. ఓటరు లిస్టులో వందలాది మంది చనిపోయిన వారి పేర్లు అలాగే ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు.చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఉండటం వల్ల, ఇతర పార్టీల వారు ఆ పేర్లతో దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పలుమార్లు ఫిర్యాదు చేసినా ఓటరు లిస్టును సరిచేయకపోవడంతోనే ఈ వినూత్న నిరసనకు దిగినట్లు తెలిపారు.చనిపోయిన వారు వచ్చి ఓట్లు వేయలేరని, కానీ వారి పేరుతో అక్రమాలు జరిగే ఛాన్స్ ఉందని ప్రజలకు వివరించడమే తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.మొత్తానికి, గెలుపు కోసం అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతుంటే, బాలు నాయక్ మాత్రం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ స్మశానానికి వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
