ఆకేరు న్యూస్, హనుమకొండ: పేదలకు ఇచ్చిన భూములను అభివృద్ధి తదితరాల పేరుతో పాలకులు గుంజుకుంటున్నారని MSP జాతీయ నేత, MRPS, MSP ఉమ్మడి జిల్లా ఇన్-చార్జ్ మంద కుమార్ మాదిగ అన్నారు.
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం, వెంకటాపూర్ గ్రామ కమ్యూనిటీ హాల్ వద్ద శనివారం MRPS గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బొక్కల అనిల్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు భూములు పంపిణీ చేశారని, వాటిని ఫ్యాక్టరీలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్ లు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు, డబుల్ రూమ్ ఇళ్ల కోసమని గుంజుకోవడవం ధర్మమా అని ప్రశ్నించారు. ఒకవైపు ప్రభుత్వాలు పేదల అసైన్డ్ భూములను గుంజుకుంటుండగా.. మరోవైపు భూస్వాములు కూడా కబ్జా చేస్తున్నారని వాపోయారు.
ఐనవోలు మండలం వెంకటాపూర్ సర్వే నంబర్ 324లోని 158 ఎకరాల అసైన్డ్ భూమిని 30 ఏళ్ల క్రితం బడుగు బలహీన వర్గాలకు అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసిందని, ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. అదే ఊరుకు చెందిన కట్ట మనోజ్ రెడ్డి అనే భూస్వామి 100 ఎకరాలు కబ్జా చేశాడని తెలిపారు.
కట్ట మనోజ్ రెడ్డి, ఎర్రబల్లి ఉపేందర్ రావు, గుజ్జ సంపత్ రెడ్డి, డాక్టర్ లక్ష్మినారాయణ కబ్జాలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పట్టాలు పంపిణీ చేయాలనీ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జన్నుదినేష్ మాదిగ, మంద రాజు మాదిగ, బండారి సురేందర్ మాదిగ, ఐనవోలు మండల ఇన్-చార్జ్ బొక్కల నారాయణ మాదిగ, సీపీఐ మదాసి యాకూబ్, బర్ల బాబు మాదిగ, ఆరూరి కుమార్ మాదిగ, సింగరపు చంద్రమౌళి మాదిగ, మరపల్లి భాస్కర్ మాదిగ, జి. కృపాకర్ మాదిగ. రడపాక కొమురయ్య మాదిగ, మదాసి చేరాలు మాదిగ, మదాసి కొమురమ్మ, మరపల్లి కమల, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
