79 new dialysis centers
* 79 కొత్త డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు
* ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
* జమ్మికుంట, కమలాపూర్ ప్రభుత్వ ఆస్పత్రులలో డయాలసిస్ సెంటర్లు
* హర్షం వ్యక్తం చేసిన వొడితల ప్రణవ్
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తగా 79 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) పద్ధతిలో, మొత్తం 416 బెడ్లతో ఈ కేంద్రాలను నెలకొల్పనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 102 డయాలసిస్ కేంద్రాలు సేవలందిస్తుండగా, రోగులకు మరింత చేరువలో వైద్యం అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రులకు డయాలసిస్ కేంద్రాలు మంజూరయ్యాయి.
* హర్షం వ్యక్తం చేసిన ప్రణవ్
నియోజకవర్గ పరిధిలోని పేద రోగులు డయాలసిస్ సేవల కోసం వరంగల్ , హనుమకొండ ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో వారి ఇబ్బందులను గమనించిన హుజూరాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్, ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఈ కేంద్రాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పేదల వైద్యం కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహకు వొడితల ప్రణవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే జమ్మికుంట, హుజూరాబాద్ ఆసుపత్రుల అభివృద్ధి కోసం ప్రభుత్వం 30 లక్షల రూపాయలు కేటాయించగా, ఇప్పుడు డయాలసిస్ కేంద్రాలు కూడా తోడవడంతో స్థానికులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానుంది.
