Ram Charan Meets PM Modi Peddi Movie
ఆకేరు న్యూస్, డెస్క్: రామ్చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది(Peddi) చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతోంది. ఇందులో భాగంగా గురువారం ఢిల్లీలో ప్రత్యేక ప్రెస్మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రామ్చరణ్తో పాటు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), దివ్యేందు శర్మ (Divyenndu Sharma), బోమన్ ఇరానీ (Boman Irani) పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రామ్చరణ్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

* మోదీ చెప్పిన కథ ..
“ఇంతకు ముందు ఢిల్లీ వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని కలిశాను. ‘పెద్ది’ సినిమా కథ గురించి ఆయన అడిగారు. నేను ఇది ఒక విధంగా వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అని చెప్పాను. అప్పుడు ఆయన నాకు ఓ స్ఫూర్తిదాయకమైన కథ చెప్పారు” అని రామ్చరణ్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్లోని ఒక గ్రామానికి చెందిన మహ్మద్ అనే ఫుట్బాల్ ఆటగాడు భారత్ తరఫున ఆడి తన గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చాడని, ప్రస్తుతం అదే గ్రామం నుంచి 85 మంది ఫుట్బాల్ ప్లేయర్లు తయారయ్యారని ప్రధాని చెప్పిన విషయాన్ని రామ్చరణ్ వెల్లడించారు.
రామ్చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చి బాబు (Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ (A.R.Rahman) సంగీతం అందిస్తున్నారు.
