TRS 2.0 Kalvakuntla Kavitha Sensational Comments Telangana
* ‘ఆంధ్రా నేతల విగ్రహాలు పగలగొట్టి పార్సల్ పంపుతాం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, తమ జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జరిగిన “తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన” రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.
* కవిత ప్రసంగంలోని ముఖ్య ముఖ్యాంశాలు..
విగ్రహాలు పగలగొట్టి పార్సల్ చేస్తాం: మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను పగలగొట్టి ఆంధ్రాకే పార్సల్ పంపుతాం. మా సంస్కృతిని మాపై రుద్దుతామంటే చూస్తూ ఊరుకోం. ఇది ‘టీఆర్ఎస్ 2.0’. మాతో పెట్టుకుంటే మంచిగా ఉండదు.
ఏపీ రాజధానిపై విమర్శలు.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఇంతవరకు రాజధాని కట్టుకోలేకపోయారు. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే తెలంగాణపై పిచ్చి వాగుడు వాగుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
* పవన్, లోకేష్లకు కౌంటర్…
పవన్ కళ్యాణ్, లోకేష్ బాబులు తెలంగాణలో సభలు పెట్టే ముందు.. వర్షాకాలంలో మీ సెక్రటేరియట్ లోకి నీళ్లు రాకుండా చూసుకోవాలి. ఆంధ్రా పార్టీలకు ఇక్కడ ఓట్లు పడవనే దుకాణం బంద్ చేసుకున్న విషయం లోకేష్ మర్చిపోవద్దు.
ఆంధ్రా ఏజెంట్ సీఎం… తెలంగాణలో ప్రస్తుతం ఆంధ్రా నాయకుల ఏజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందుకే ఒక కుట్ర ప్రకారం తెలంగాణ మేధావులపై ఆంధ్రా పోలీసులతో ఎదురుదాడి చేయిస్తున్నారు. ఇక్కడ స్థిరపడిన ఆంధ్రా ప్రజలు మా వాళ్లే, కానీ మా నీళ్లు, రాజకీయాల్లో వేలు పెడితే సహించం. ప్రస్తుత సీఎం గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టుకు ఓకే చెప్పి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు.
* ఉద్యమకారులకు న్యాయం జరగాలి…
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చలేదు. కేకే, పీకే కమిటీల పేరుతో కాలయాపన ఆపి, రేపటి ఆవిర్భావ దినోత్సవం నాడే సీఎం హామీలను ప్రకటించాలి. కోదండరాం లాంటి ఒకరిద్దరికీ పదవులు ఇస్తే సరిపోదు.
తెలంగాణ హక్కుల కోసమే తాము ‘పాంచజన్యం’ అనే ఐదు అంశాల విధానంతో ముందుకు వెళ్తున్నామని, రైతులకు మేలు చేయడం, యువతకు ఉద్యోగాలతో పాటు రూ.2 లక్షల నుండి రూ.20 కోట్ల వరకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించడమే తమ లక్ష్యమని కవిత స్పష్టం చేశారు.
